- జడ్పీ జనరల్ బాడీ మీటింగ్లో నిలదీసిన సభ్యులు
- నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయని, ఎకరాకు రూ.20వేల నష్టం జరిగిందని ఆవేదన
- పైపులు మారిస్తేనే సమస్య పరిష్కారం... కడెంలోనూ నీళ్లు లేవు
- యాసంగికి సాగునీళ్లు రావని చెప్పకనే చెప్పిన కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల,వెలుగు: గూడెం లిఫ్ట్ నుంచి నీళ్లు రాక యాసంగి పంటలు ఎండిపోతున్నాయని లక్సెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ సభ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే 70శాతం పొలాలు ఎండిపోయాయని, మిగతా 30శాతం కూడా ఎండిపోయే దశలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ యాసంగికి నీళ్లు ఇస్తరా, ఇయ్యరా? రైతులకు ఏదో ఒకటి స్పష్టం చేయాలని బుధవారం జరిగిన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్లో అధికారులను నిలదీశారు. లిఫ్ట్ నుంచి నీళ్లు వస్తాయనే ఆశతో రైతులు వరినాట్లు వేశారని, ఇప్పటికే ఎకరాకు రూ.20 వేలకు పైగా పెట్టుబడి నష్టపోయారని సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గూడెం లిఫ్ట్ను మేఘా కంపెనీ సరిగా మెయింటెన్ చేయడం లేదని, కడెం ప్రాజెక్టు అధికారులు లిఫ్ట్ను పర్యవేక్షించడం లేదని శ్రీనివాస్ చెప్పారు. కొన్నిచోట్ల ఇసుక పోయకుండా మట్టిలోనే పైపులు వేయడం వల్ల తరచూ పగిలిపోతున్నాయని తెలిపారు. లిఫ్ట్ నుంచి నీళ్లు రాకుంటే కడెం ప్రాజెక్టు నుంచి రిలీజ్ చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ భారతి హోళికేరి స్పందిస్తూ... గూడెం లిఫ్ట్ ప్రస్తుత జీఆర్పీ పైపులను తొలగించి ఎమ్మెస్ పైపులు వేస్తేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కడెం ప్రాజెక్టులో సిల్ట్ చేరి నీటి నిల్వ తగ్గిందని, అక్కడినుంచి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. మేఘా కంపెనీ గూడెం లిఫ్ట్ను సరిగా మెయింటెన్ చేయడం లేదని, దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. జూలైలో వచ్చిన వరదల్లో లిఫ్ట్ పూర్తిగా మునిగిపోవడంతో ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ యాసంగిలో కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగునీరు రాదన్న విషయాన్ని కలెక్టర్ చెప్పకనే చెప్పారు.
అధికారులపై ఎంపీ ఆగ్రహం...
ఇరిగేషన్ ఈఈ, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ జడ్పీ మీటింగ్కు గైర్హాజరు కావడంపై ఎంపీ వెంకటేశ్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరికి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్కు సూచించారు. అధికారులు బాధ్యతరహితంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఇకమీదట జడ్పీ చైర్పర్సన్ పర్మిషన్ లేకుండా మీటింగ్కు రాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని, సరైన కారణం లేకుండా గైర్హాజరైన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు.
నవ్వులు పూయించిన సత్తయ్య...
ప్రతీసారి జడ్పీ మీటింగ్లో అందరికంటే ఎక్కువగా ప్రశ్నలు వేస్తూ అధికారులను తిప్పలుపెట్టే లక్సెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య ఈసారి నవ్వులు పూయించారు. జంతు సంక్షేమం కోసం పౌరులు పాటించాల్సిన రూల్స్ గురించి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్, కలెక్టర్ భారతి హోళికేరి వివరించారు. ప్రకృతిలో మనుషులతో పాటు జంతువులకూ సమాన హక్కులు ఉన్నాయని, జీవాల పట్ల కరుణ కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా సత్తయ్య గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేశారు. 'గంగిరెద్దుల వాళ్లు పెంచుకుంటున్న కుక్కలు అడవిపందిని చంపితే ఫారెస్ట్ ఆఫీసర్లు యజమానిపై కేసుపెట్టి జైలుకు పంపిన్రు. మరి కుక్కులను పెంచుకోవాలా, వద్దా' అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. సంక్రాంతి సందర్భంగా ఎడ్ల పందాలు నిర్వహించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జేడీ రమేష్ ఎమ్మెల్యే చిన్నయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్రావు గైర్హాజరయ్యారు.
పీఏసీఎస్లకు స్థలాలకు కేటాయించాలి...
మంచిర్యాల జిల్లాలో 35 పీఏసీఎస్లకు గాను పదింటికి సొంత బిల్డింగులు లేవని ఏడీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయని తెలిపారు. బిల్డింగుల నిర్మాణం కోసం 5గుంటలు, గోడౌన్ల కోసం అర ఎకరం స్థలాలు కేటాయించాలని కోరారు. జీవో 571 ప్రకారం సంబంధిత శాఖ కమిషనర్ ద్వారా ప్రపోజల్స్ పంపిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.
పెన్షన్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు, రోడ్ల దుస్థితిపై చర్చ...
జిల్లాలోని సర్కారు స్కూళ్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, వెటర్నరీ హాస్పిటళ్లు, రోడ్ల దుస్థితిని ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన పేదలకు ఆసరా పెన్షన్లు రావడం లేదని, సదరం క్యాంప్లో తిరస్కరించిన వారికి రీ అసెస్మెంట్ చేసి వికలాంగుల సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. విద్యాసంవత్సరం పూర్తికావస్తున్నా స్టూడెంట్లకు యూనిఫామ్స్ రాలేదని, ఇచ్చినవి కూడా పొట్టిగా, పొడుగ్గా, లూజ్గా ఉన్నాయని అన్నారు. ఔట్సోర్సింగ్ పోస్టుల నియామకాల్లో రూల్స్ పాటించకపోవడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. మెరిట్, రోస్టర్ ప్రకారమే ఎంపిక చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై అక్కడి సభ్యులు ప్రశ్నించారు. ఏండ్లు గడుస్తున్నా నీల్వాయి బ్రిడ్జి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. మార్చిలోగా పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ఆర్అండ్బీ ఈఈ రాము, పంచాయతీరాజ్ఈఈ ప్రకాశ్ అన్నారు.