
దేశంలో రెండు రాష్ట్రాలకు ఎన్నికల నగరా మోగనుంది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో గడువు ముగుస్తుంది, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 8తో ముగుస్తుంది. ఎన్నికల ప్రక్రియపై సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు ఇటీవల రెండు రాష్ట్రాల్లో సందర్శించారు.
బీజేపీ అధికారంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పటి నుంచే ప్రధాని నరేంద్ర మోడీతో సహా అగ్రనేతలు వరుసగా ర్యాలీలు, పర్యటనలు జరుపుతున్నారు. గురువారం హిమాచల్ ప్రదేశ్ నుంచే నాలుగో వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించారు. అటు గుజరాత్ లో బీజేపీకి షాకివ్వాలని ఆమ్ ఆద్మీ ప్రణాళికలు వేస్తోంది. ఆప్ ను గెలిపిస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ హామీల వర్షం కురిపిస్తోంది. గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా..హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.