గుజరాత్ యువకుడి నయా ఆలోచన
ఇంట్లోనే నిమజ్జనం చేసేలా వజ్రాసన బ్యాగు
నిమజ్జనం వల్ల వచ్చే ముద్దతో ఇటుకల తయారీ
గణేశ్ పండుగ దగ్గరకొచ్చేస్తోంది. ఇంకో ఐదు రోజులు. ఇప్పటికే కొన్ని లక్షల మంది వినాయక విగ్రహాలను కొనుక్కెళ్తున్నారు. అయితే, అందులో ఎక్కువగా ఉండేది ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన గణేశ్ బొమ్మలే. అయితే, అవి పర్యావరణానికి హాని చేస్తాయని, మట్టితో చేసిన బొజ్జ గణపయ్యలను వాడాలని పర్యావరణ ప్రేమికులు ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. ఎంత చేసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపయ్యలకే డిమాండ్ ఎక్కువ. కానీ, గుజరాత్కు చెందిన డాక్టర్ బినీశ్ దేశాయ్ అనే యువకుడు మాత్రం కొంచెం కొత్తగా ఆలోచించాడు. మట్టితో కాకుండా నగలు తయారుచేసేటప్పుడు మిగిలే వ్యర్థాలతో చేయాలనుకున్నాడు. వెంటనే వినాయకుడి బొమ్మను తయారు చేశాడు. అయితే, అది బంగారు నగల వేస్ట్ కాదులెండి. గిల్టు నగలు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి నగల వేస్ట్తో బొజ్జ గణపయ్యకు రూపునిచ్చాడు.
ఎకో ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ను నడుపుతున్న బినీశ్ వయసు 26 ఏళ్లు. ‘‘గిల్టు నగలు చేసేటప్పుడు కొన్ని గ్లాస్ బీడ్లను పెడుతుంటారు. వాటిని నగలకు అనువుగా మలిచేటప్పుడు చాలా వరకు పొడి వేస్ట్గా పోతుంది. ఆ పౌడర్ భూమిలో కలిసిపోదు. ఆ వేస్ట్ భూమిపైన పేరుకుపోకుండా ఉండేందుకు ఈ కొత్త ఆలోచనను చేశా. పర్యావరణానికి మేలు చేసే గణేశుడిని తయారు చేశా. నగల దుకాణాల నుంచి ఆ వేస్ట్ను సేకరించి, దానికి కొన్ని ప్రత్యేకమైన పర్యావరణహితమైన బైండర్లను కలిపి ముద్దలా మార్చాం. వినాయకుడిని రూపునిచ్చాం. ఆ తర్వాత విగ్రహానికి ఎరుపు, పసుపు, ఊదా వంటి రంగులు అద్దాం. ఆ రంగులూ కృత్రిమమైనవి కాదు. పూల నుంచి తీసినవి” అని బినీశ్ చెప్పాడు. ఒక్కో విగ్రహాన్ని తయారు చేసేందుకు సుమారు 16 కిలోల నగల వేస్ట్ పౌడర్ అవసరమైందని బినీశ్ చెప్పాడు.
ఈ వినాయకుడి విగ్రహంతో పాటు ఇంట్లోనే నిమజ్జనం చేసుకునేలా వజ్రాసన బ్యాగునూ ఇస్తున్నారు. ఆ బ్యాగులో వినాయకుడిని పెట్టి, టబ్బులో నిమజ్జనం చేసేయొచ్చట. అయితే, వచ్చే ఏడాది నుంచి జనానికి వీటిని అమ్ముతారట. ప్రస్తుతం తయారు చేసిన బొమ్మలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు గిఫ్ట్గా ఇస్తామని బినీశ్ చెప్పాడు. విగ్రహం సైజును బట్టి ₹1800 నుంచి ₹12 వేల వరకు ఉంటుందన్నాడు. అంతేకాదు, నిమజ్జనం చేసిన ఈ వినాయకుడినే ఇటుకలుగా మార్చే ఆలోచనా చేస్తున్నాడు. స్కూళ్లు, టాయిలెట్లు, ఇళ్ళు కట్టేందుకు వాటినే వాడేలా కృషి చేస్తాడట. అయితే, ఈ ఆలోచనా ఇప్పటిది కాదు. 11 ఏళ్ల వయసులోనే వేస్ట్ను ఎలాగైనా వాడుకోవాలన్న పట్టుదలతో పనిచేశాడు బినీశ్. అందులో భాగంగానే 23 ఏళ్ల వయసులో పేపర్ మిల్లుల నుంచి వచ్చే వేస్ట్తో పీ బ్లాక్ ఇటుకలను తయారు చేశాడు. దేశ వ్యాప్తంగా 3700 టాయిలెట్లకు ఆ పీ బ్లీక్ ఇటుకలనే వాడారు. ఇప్పటిదాకా 1780 టన్నుల వేస్ట్ను రీసైకిల్ చేసి 9 వేల ఇళ్లకు లాభం చేశాడు.