వీధి కుక్క కోసం.. భార్యను చంపుకున్నాడు

వీధి కుక్క కోసం.. భార్యను చంపుకున్నాడు

నేరం చేసి దాని నుంచి ఎలా తప్పించుకోవాలా..! అనే ఆలోచించే సమాజం మనది. అంతకూ కాదంటే చేసిన నేరాన్ని పక్కవారిపై నెట్టేయడమో లేదా ప్రమాదకరంగా చిత్రీకరించడమో చేస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం చేయని తప్పును తనపై వేసుకున్నాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకున్నాడు. చేయని తప్పుకు ఆయన అలా ఎందుకు చేశాడు అనేది తెలియాలంటే కింది కథనం చదవాల్సిందే..

గుజరాత్‌లోని నర్మదా జిల్లాకు చెందిన పరేష్ దోషి(55) తన భార్య అమితతో కలిసి ఇటీవల అంబాజీ ఆలయానికి వెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా సబర్‌కాంతా ప్రాంతంలో ఖేరోజ్-ఖేద్‌బ్రహ్మ జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా పరుగెడుతోన్న వీధి కుక్కను తప్పించబోయి ఆయన కారును పక్కకు తిప్పాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బారికేడ్లను ఢీకొంది. ఈ ఘటనలో పరేష్ దోషి స్వల్ప గాయాలతో బయటపడగా.. ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటీన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.

ఈ ఘటనలో తన తప్పేమి లేకపోయినా పరేష్ దోషి, తన నిర్లక్ష్యం వల్లే భార్య మరణించినట్లు పోలీసులకు పిర్యాదు చేశాడు. తనపై తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకున్నాడు.