జ్ఞాన్వాపి మసీదు కేసు.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

జ్ఞాన్వాపి మసీదు కేసు.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

జ్ఞాన్ వాపి మసీదు కేసు విచారణను వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు. యూపీ జ్యుడీషియల్ సర్వీసెస్ కు చెందిన అనుభవజ్ఞుడైన న్యాయవాది ఈ కేసులు విచారించాలని ఆదేశించింది. జ్ఞాన్ వాపి మసీదుకు సంబంధించి.. కమిటీ వేసిన పిటిషన్ పై విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. జిల్లా జడ్జి ఈ కేసును విచారణ జరిపితే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది జస్టిస్ చంద్రచూడ్ బెంచ్. 20 – 25ఏళ్ల అనుభవమున్న వారణాజి జిల్లా జడ్జికి విచారణ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పింది. ఆయన నిర్ణయించేంత వరకు హిందూవుల ప్రార్థనలకు అనుమతిపై నిర్ణయం తీసుకోలేమని చెప్పింది సుప్రీంకోర్టు. అప్పటివరకు శివలింగం రక్షణకు.. ఈనెల 17న ఇచ్చిన ఉత్తర్వులే అమలవుతాయని స్పష్టం చేసింది. జ్ఞాన్ వాపి మసీదులో ముస్లింల ప్రార్థనలు కొనసాగుతాయని చెప్పింది సుప్రీంకోర్టు. 

వీడియో గ్రాఫిక్ సర్వేకు ఆదేశిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అంజుమన్ ఇంతెజామియా మసాజిద్ కమిటీ వేసిన పిటిషన్ పై విచారించింది. జ్ఞాన్ వాపి సర్వే కమిటీ రిపోర్టుపై పత్రికలకు లీకులు ఇవ్వొద్దని ఆదేశించింది. జడ్జి మాత్రమే నివేదికను తెరుస్తారని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. శాంతిని నెలకొల్పాలన్నదే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది కోర్టు. దేవాలయ శిథిలాలపై మసీదు నిర్మించారని హిందూ సంఘాల తరఫు న్యాయవాది వాదించారు. అయితే 5వందల ఏళ్ల నాటి చరిత్రను, ఆనవాళ్లను మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు అంజుమన్ ఇంతెజామియా మసాజిద్ కమిటీ తరఫు న్యాయవాది. మసీదు పరిసరాల్లో ఉన్నది శివలింగం కాదని.. వాటర్ ఫౌంటెయిన్ మాత్రమేనన్నారు సీనియర్ లాయర్ హుజెఫా అహ్మదీ. శివలింగం రక్షణ.. మధ్యంతర ఉత్తర్వుల కంటిన్యూపై సుప్రీం ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు హిందూ సంఘాల లాయర్ విష్ణు జైన్.

మరిన్ని వార్తల కోసం : -
కెనడా పార్లమెంటులో కన్నడలో ఎంపీ ప్రసంగం



జకార్తా బయలుదేరిన పురుషుల హాకీ టీం