- భారత్లోని ఎంబసీల్లో దరఖాస్తుదారుల బ్యాక్లాగ్లు పేరుకుపోవడమే కారణం
వాషింగ్టన్: హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం అప్లయ్ చేసుకున్నవాళ్లకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికే రెగ్యులర్ వీసా అప్లికేషన్ల ఇంటర్వ్యూలకు వెయిటింగ్ పీరియడ్ ఏడాది వరకు ఉండగా, తాజా పరిణామాలతో హెచ్1బీ వీసా రెన్యువల్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్ కోసం 2027 దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలోని యూఎస్ కాన్సులేట్లలో పేరుకుపోయిన అప్లికేషన్ల బ్యాక్లాగ్లే ఇందుకు కారణమైంది.
వీసా రెన్యువల్ కోసం భారత్కు వచ్చి అమెరికాకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న టెకీలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది. సమస్య ఇప్పటిలో తగ్గే అవకాశం లేదు కాబట్టి, అమెరికాలో హెచ్1బీ వీసాతో ఉన్నవాళ్లు వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వెళ్లొద్దని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు ఇప్పటికే రద్దయ్యాయని, జనవరి.. ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్నవాళ్లకు కూడా తేదీలు మార్చి ఏడాది తర్వాత 2027లో కేటాయిస్తూ మెయిల్స్ పంపుతున్నారని చెప్తున్నారు.
గత డిసెంబర్ నుంచే సమస్య..
నిజానికి గత డిసెంబర్నాటికి వచ్చిన అప్లికేషన్లు పెండింగ్లో పడటంతో మొదలైన వెయిటింగ్ పీరియడ్ అలాగే కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా కాన్సులేట్ సెంటర్లలో కొత్త దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ స్లాట్లు వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నారు. దీంతో వీసా స్టాంపింగ్ కోసం వచ్చిన వేలాదిమంది ఐటీ ప్రొఫెషనల్స్ ఇక్కడే చిక్కుకుపోయి.. ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టులు, అగ్రిమెంట్లలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ట్రంప్ సర్కారు ఇటీవల హెచ్1బీ వీసా అప్లికేషన్ ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో కంపెనీలు కొత్త వీసాల కోసం దరఖాస్తులు చేయడం తగ్గించాయి.
