
ధర్మసాగర్, వెలుగు: గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ సూచించారు. మంగళవారం కలెక్టర్ ధర్మసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వివరాలను అడిగి తెలసుకున్నారు.
మందుల నిల్వను పరిశీలించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పరీక్షలపై ఆరా తీశారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్, వైద్యులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ధర్మసాగర్ తహసీల్దార్ ఆఫీస్ను తనిఖీ చేసి, భూభారతి దరఖాస్తులపై ఆరా తీశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.