న్యూఢిల్లీ : సిమ్ బాక్స్ ఫ్రాడ్స్ కంపెనీలకు, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూపై ప్రభావం చూపడమే కాకుండా యూజర్ల ప్రైవసీకి, నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగిస్తున్నాయి. మోసగాళ్లు ఇంటర్నేషనల్ కాల్స్ను ఒక సెల్యూలర్ డివైజ్తో ఇంటర్నెట్ ద్వారా లోకల్ కాల్స్గా డైవర్ట్ చేస్తారు. ఈ సెల్యూలర్ డివైజ్ను సిమ్ బాక్స్ అంటారు. ఈ సిమ్ బాక్స్లో కొన్ని వందల సిమ్ కార్డులు ఉంటాయి. సాధారణంగా ఈ సిమ్ కార్డులు కూడా తప్పుడు డాక్యుమెంట్లతో తీసుకున్నవే అయి ఉంటాయి. సిమ్ బాక్స్ ఫ్రాడ్స్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. 2021 లో ది ఫ్రాడ్ లాస్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, సిమ్ బాక్స్ ఫ్రాడ్స్ వలన గ్లోబల్గా 3.11 బిలియన్ డాలర్ల లాస్ వచ్చింది. ఇది మొత్తం టెలికం ఫ్రాడ్స్లో 7.8 శాతానికి సమానం. ఇండియాలో కూడా సిమ్ బాక్స్ ఫ్రాడ్స్ బయటపడ్డాయి. యాంటి టెర్రర్ సెల్, బెంగళూరు మిలిటరీ ఇంటెలిజెన్స్తో కలిసి 2021 లో ఇల్లీగల్గా నడుస్తున్న ఆరు టెలిఫోన్ ఎక్స్చేంజిలపై దాడులు చేసింది. మొత్తం 109 సిమ్ బాక్స్ డివైజ్లను, 3,000 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది.
నష్టమే..
సిమ్ బాక్స్ ఫ్రాడ్స్ వలన టెలికం ఆపరేటర్లకు ఇంటర్నేషనల్ కాల్స్ ద్వారా వచ్చే రెవెన్యూ భారీగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి ట్యాక్స్లు, సర్ఛార్జీలు ద్వారా వచ్చే రెవెన్యూ పడిపోతుంది. సిమ్ బాక్స్ ఫ్రాడ్స్ వలన కాల్స్ క్వాలిటీ తగ్గుతుంది. దీంతో టెలికం కంపెనీల సర్వీస్ క్వాలిటీ స్టాండర్డ్స్ పడిపోతాయి. లోకల్ నెట్వర్క్స్పై లోడ్ పెరగడంతో టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది కూడా. యూజర్ల ఇన్ఫర్మేషన్ హ్యాకర్ల చేతికి చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. మోసగాళ్లు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీల కళ్లుగప్పడానికి సిమ్ బాక్స్లను వాడుతుంటారు. ఈ ఫ్రాడ్స్ వలన నేషనల్ సెక్యూరిటీ సంక్షోభంలో పడే అవకాశం ఉంటుంది.