
- కాళేశ్వరం నోటీసులు వచ్చాక వాళ్లిద్దరూ ఓ ఫామ్హౌస్లో కలిశారు: మహేశ్గౌడ్
- అక్కడి నుంచే కేసీఆర్తో మాట్లాడారు
- కమిషన్ ముందు ఒకే ఆన్సర్ చెప్పాలని డిసైడ్ అయ్యారు
- బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గరపడింది
- కవిత వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ స్పందించాలె
- రాజాసింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం కమిషన్ నోటీసులు వచ్చిన తర్వాత హైదరాబాద్ శివారు శామీర్ పేటలోని ఓ ఫామ్ హౌస్లో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి హరీశ్రావు భేటీ అయ్యారని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ తెలిపారు. ఈ భేటీపై తమకు పక్కా సమాచారం ఉందని అన్నారు. అక్కడి నుంచే కేసీఆర్కు ఫోన్ చేసి మాట్లాడారని పేర్కొన్నారు. కమిషన్ ముందు కేసీఆర్, హరీశ్ రావు, ఈటెల రాజేందర్.. ముగ్గురూ ఒకేలా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఈటలకు నోటీసులు రాగానే పాత చుట్టరికం గుర్తుకువచ్చిందని, బీజేపీలో ఉన్నా ఆయన మనసంతా బీఆర్ఎస్లోనే ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో కలిసి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదటి నుంచీ కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎం అంటున్నారు. ఈటల ఆ వ్యాఖ్యలను బలపరుస్తారా? లేదంటే కేసీఆర్ కు సపోర్ట్గా మాట్లాడుతారా?’’ అని మహేశ్కుమార్గౌడ్ నిలదీశారు. బీజేపీ లో బీఅర్ఎస్ విలీనానికి టైం దగ్గరపడిందని, విలీనమా? అమ్మకమా? లేదంటే ఇరు పార్టీల నేతలు కలిసి ప్రెస్ మీట్ పెడతరా? అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుందన్నారు. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దశలవారీగా కమిటీలు రిలీజ్ చేస్తం..
పార్టీ కమిటీలు ఇటీవల కొన్ని రిలీజ్ చేశామని, త్వరలో మరికొన్ని విడుదల చేస్తామని మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. సామాజిక సమీకరణాలు పాటించామని, ఈ పేర్లపై ఎంతోకాలంగా కసరత్తు చేశామని , పార్టీలో ఊహాగానాలు సర్వసాధారణమని పేర్కొన్నారు. ఖర్గే ఢిల్లీలో లేరని, ఆయన ఢిల్లీకి చేరుకోగానే వెళ్లి కలుస్తానని చెప్పారు. పీఏసీ కమిటీలో మంత్రులందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారని చెప్పారు. కేబినెట్ బెర్త్ లకు, కమిటీల్లో చోటు కు సంబంధం లేదని, మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్లు కూడా కమిటీలో ఉన్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లడం లో తప్పు లేదని, ఎవరి సామాజికవర్గానికి వాళ్లు మంత్రి పదవి అడుగుతున్నారని తెలిపారు. ట్రంప్ ప్రలోభాలకు ప్రధాని మోదీ లొంగి పోయారని, దేశ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్లు రాహుల్ గాంధీ పై విమర్శలు చేస్తున్నారని మహేశ్గౌడ్ మండిపడ్డారు. యుద్ధం టైం లో కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చిందని, సైనికులకు రాహుల్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ట్రంప్కు తలొగ్గి యుద్ధం ఎందుకు ఆపారని దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారని, మోదీ, కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ ని పార్లమెంట్లో వాజ్ పేయి పొగిడారని, ఈ విషయం కొత్త ఎంపీ కిషన్ రెడ్డి కి తెలియదని, అనుమానం ఉంటే రికార్డ్స్ లో ఉంటుంది చూసుకోవాలని సూచించారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ముందే చెప్పినం
బీజేపీ నేతలు ఎలా అమ్ముడు పోయారో రాజాసింగ్ చెప్పారని, ఆయన ఆరోపణలపై కిషన్ రెడ్డి ,ఈటల, రఘునందన్ కు సమాధానం చెప్పే దమ్ముందా? అని మహేశ్గౌడ్ సవాల్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని తాము మొదటి నుంచీ చెప్తున్నామని, కవిత వ్యాఖ్యలతో ఆ విషయం రుజువైందన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వల్లే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందని చెప్పారు. కేసీఆర్, కిషన్ రెడ్డి కలిసిపోవడం వల్లే బీజేపీ హైకమాండ్..బీసీ అధ్యక్షుడైన బండి సంజయ్ ని తొలగించిందన్నారు. 10 ఏండ్లు దోచుకున్న సొమ్ము కోసం కేసీఆర్ ఇంట్లో వదిన, మరదలు నడుమ గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని, అందులో ఉన్న సామాన్ల కోసమే ఈ గొడవలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వాటాలు పంచితే గొడవ తీరుతుందని తెలిపారు. కవిత పంచాయితీతో, ఆమె లేఖతో కాంగ్రెస్ కు ఏం సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ లో కవిత చేరే ప్రస్తావనే లేదని చెప్పారు. ‘‘ ప్రతి పార్టీలో కోవర్టులు ఉంటారు. రాసిన వాళ్లు, లీక్ చేసిన వాళ్లెవరో ఆ పార్టీవాళ్లే చెప్పాలి. కవిత, కేసీఆర్ ఆఫీస్ లే లేఖను లీక్ చేసినట్లు అనిపిస్తుంది’’ అని మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు.