- ఐపీఓలో ఎవరూ పట్టించుకోని స్టేజ్ నుంచి రూ.5 లక్షల కోట్ల కంపెనీగా హెచ్డీఎఫ్సీ
- గురువారం నుంచి మార్కెట్లో షేర్ల డీలిస్టింగ్
బిజినెస్ డెస్క్, వెలుగు: మూడు దశాబ్దాలలో షేరు ధర రూ.7 నుంచి రూ. 2,900 కు... హెచ్డీఎఫ్సీ ప్రయాణం ఎన్నో ఒడుదుడుకులతో సాగింది. కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కి వచ్చినప్పుడు ఇన్వెస్టర్ల నుంచి రెస్పాన్స్ కూడా లేదు. 1978 లో హెచ్డీఎఫ్సీ రూ.100 ఫేస్ వాల్యూతో ఐపీఓకి వచ్చింది. కంపెనీ షేర్లు సబ్స్క్రయిబ్ కాకుండా మిగిలిపోయాయి. అంతేకాకుండా ఇష్యూ ధర కంటే తక్కువకు లిస్ట్ అయ్యాయి. ఆ స్టేజ్ నుంచి ప్రస్తుతం రూ.5 లక్షల కోట్ల వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా హెచ్డీఎఫ్సీ ఎదిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో విలీనం కావడంతో కంపెనీ షేర్లు గురువారం మార్కెట్ నుంచి డీలిస్ట్ అవుతాయి. ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన హెచ్డీఎఫ్సీ ఆనవాళ్లు ఇక నుంచి కనిపించవు. గత ముప్పై ఏళ్లలో కంపెనీ ఇంత వేగంగా ఎదగడానికి కారణం సమర్ధవంతమైన మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు.
జర్నీ ఇలా...
మార్కెట్లో అవకాశాలను చూసిన హస్ముఖ్ థకొర్డస్ పరేఖ్ 1977 లో హెచ్డీఎఫ్సీని స్థాపించారు. ఆయన మేనల్లుడు దీపక్ పరేఖ్ ఈ కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. హెచ్డీఎఫ్సీ గ్రూప్ మొత్తానికి హెచ్డీఎఫ్సీ పేరెంట్ కంపెనీ. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేరుతో బ్యాంకింగ్ సెక్టార్లోకి 1995 లో ఈ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశంలోని టాప్ 5 బ్యాంకుల్లో ఒకటిగా ఉంది. దేశం మొత్తం మీద 7,280 బ్రాంచులను ఆపరేట్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ మాదిరి కాకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐపీఓకి భారీ డిమాండ్ కనిపించింది. కంపెనీ షేర్లు 1995 లో దలాల్ స్ట్రీట్లోకి ఎంట్రీ ఇవ్వగా, పబ్లిక్ ఇష్యూ ఏకంగా 53 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. రూ.4 ఉన్న షేరు ప్రస్తుతం 1,700 దగ్గర ట్రేడవుతోంది. అయినప్పటికీ బ్యాంక్ షేర్లు ఇంకా తమ15 ఏళ్ల సగటు కంటే 20 శాతం తక్కువకు ట్రేడవుతున్నాయని, మరింత పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ 2000 లో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ను ఏర్పాటు చేసింది. అదే సంవత్సరం ఐఆర్డీఏ నుంచి అనుమతులు పొంది హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ను తీసుకొచ్చింది. దేశంలో ఇదే మొదటి ప్రైవేట్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ కావడం విశేషం. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ ఎర్గో, హెచ్డీఎఫ్సీ క్రెడిలా, గృహ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ రెడ్, హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ వంటి సబ్సిడరీలు కూడా హెచ్డీఎఫ్సీకి ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ సక్సెస్ అయ్యాయి కూడా.
విలీనంతో ముందుకు..
హెచ్డీఎఫ్సీ ఇక నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్గా మనకు సేవలు అందించనుంది. తర్వాతి తరం గ్రోత్ను బ్యాంక్ లీడ్ చేయనుంది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మెర్జర్ ఈ నెల 1 న అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విలీన సంస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద బ్యాంక్గా (మార్కెట్ క్యాప్ ప్రకారం) నిలిచింది. హెచ్డీఎఫ్సీ షేర్లు 13 న డీలిస్ట్ కానుండగా, షేరు హోల్డర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను ఇష్యూ చేయడానికి ఈ తేది రికార్డ్ డేట్గా పనిచేస్తుంది. హెచ్డీఎఫ్సీ షేర్లు చివరిసారిగా బుధవారం ట్రేడయ్యాయి. అర శాతం నష్టపోయి రూ.2,732 దగ్గర ముగిశాయి.
ఇండెక్స్లో రారాజు...
నిఫ్టీ, సెన్సెక్స్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రారాజుగా కొనసాగనుంది. నిఫ్టీ 50 లో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కు 10.8 శాతం వెయిటేజ్ ఉండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెయిటేజ్ 14.43 శాతానికి పెరిగింది. రిలయన్స్ మాదిరి కాకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు పూర్తిగా పబ్లిక్ చేతులో ఉన్నాయి. బ్యాంక్ ఫ్రి ఫ్లోటింగ్ క్యాప్ మిగిలిన లిస్టెడ్ కంపెనీల కంటే ఎక్కువగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.14 లక్షల కోట్లకు పెరగడంతో దేశంలో రెండో అతిపెద్ద సంస్థగా ఎదిగింది. రిలయన్స్ రూ.18 లక్షల కోట్లతో టాప్లో కొనసాగుతోంది.
దీపక్ పరేఖ్ శాలరీ రూ.3,500..
దీపక్ పరేఖ్ 1979 లో పొందిన ఆఫర్ లెటర్ ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఆయన మొదట జాయిన్ అయ్యారు. ఆఫర్ లెటర్ ప్రకారం, దీపక్ పరేఖ్ బేసిక్ శాలరీ రూ.3,500 ప్లస్ రూ.500 ఫిక్స్డ్ డిఏ. దీనికి అదనంగా 15% హౌసింగ్ రెంట్ అలొవెన్స్, 10% సిటీ కాంపెన్సటరీ అలొవెన్స్, ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ ట్రావెల్ ఫెసిలిటీ, రియంబర్స్మెంట్ రెసిడెన్షియల్ ఫోన్ ఎక్స్పెన్సెస్ వంటివి దీపక్ పరేఖ్ అందుకున్నారు.