ప్రేమ్‌‌చంద్‌‌ రాయ్‌‌చంద్‌‌.. దేశంలో ఫస్ట్‌‌ స్టాక్ బ్రోకర్‌‌‌‌

ప్రేమ్‌‌చంద్‌‌ రాయ్‌‌చంద్‌‌.. దేశంలో ఫస్ట్‌‌ స్టాక్ బ్రోకర్‌‌‌‌

ముంబై: బాంబే స్టాక్​ఎక్స్ఛేంజ్ (బీఎస్​ఈ)​ ఏర్పాటు వెనుక చాలా కథ ఉంది. ఒక కలల వ్యాపారి దీనికి బాటలు వేశారు. ఇప్పుడయితే ఇది 29 అంతస్తుల భవనంలో ఉంది కానీ ఒకప్పుడు చెట్టుకింద నడిచేది. అక్కడే కూర్చొని ట్రేడింగ్​ చేసేవారు. బీఎస్​ఈ ఏర్పాటులో అత్యంత కీలకంగా వ్యవహరించింది ప్రేమ్​చంద్​ రాయ్​చంద్​ జైన్​ అనే వ్యాపారి. ఇండియాలో స్టాక్​ మార్కెట్​ను ముందుండి నడిపించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ముంబై (అప్పట్లో బొంబాయి)లో ఆయనను బిగ్ బుల్, బులియన్ కింగ్,  కాటన్ కింగ్ అని పిలిచేవారు. జంషెద్​​జీ టాటా, డేవిడ్ సాసూన్,  జంషెడ్‌జీ జేజీబాయ్‌‌‌‌లతో పాటు నలుగురు 'బాంబే వ్యాపార యువరాజులలో' ఒకరిగా పేరు పొందారు. అప్పట్లో ముంబైలోని అత్యంత ధనవంతుల్లో జైన్​ఒకరు. మనదేశంలో నేటివ్ షేర్ & స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్‌‌‌‌ను స్థాపించింది ఆయనే! అది తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌‌‌గా మారింది.

మనదేశంలోనేని మొదటి స్టాక్​ బ్రోకర్​ ఆయనే. అంతేకాదు స్టాక్​, బులియన్​ ట్రేడింగ్​ చేసేవారు. పత్తి వ్యాపారమూ జరిపేవారు. బీఎస్​ఈ ఇప్పుడు మనదేశంలో  రెండవ అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. దీని  లిస్టెడ్ కంపెనీల  మార్కెట్ క్యాప్ రూ. 300 లక్షల కోట్లను మించిపోయింది.  1865లో దీనిని స్థాపించారు.  దక్షిణ బొంబాయిలోని ఒక మర్రిచెట్టు కింద రాయ్‌‌‌‌చంద్ ఆఫీసులో దాదాపు 22 మంది బ్రోకర్ల నుండి కేవలం రూపాయి మూలధనంతో ఇది ఏర్పడింది. 

ఇంగ్లిష్​లో కింగ్​.. సూపర్​ మెమొరీ

రాయ్‌‌‌‌చంద్ 1832లో సూరత్‌‌‌‌లో రాయ్‌‌‌‌చంద్ దీప్‌‌‌‌చంద్ అనే కలప వ్యాపారికి జన్మించారు. బాల్యంలోనే తన కుటుంబంతో సహా బొంబాయికి వెళ్లారు. ఎల్ఫిన్‌‌‌‌ స్టోన్ కాలేజ్‌‌‌‌లో రాయ్‌‌‌‌చంద్ చదువుకున్నారు. ఇంగ్లిష్​లో మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసిన మొదటి భారతీయ బ్రోకర్‌‌‌‌ కూడా ఆయనే!   యంగ్​ఏజ్​లోనే స్టాక్ బ్రోకర్​గా వృత్తిని ప్రారంభించారు.  ప్రేమ్‌‌‌‌చంద్​కు అసమానమైన జ్ఞాపకశక్తి ఉండేది.  ఎప్పుడూ పెన్ను,  కాగితం ఉపయోగించలేదు.  తన వ్యాపారాల లెక్కలన్నీ ఆయన నాలుకపైనే ఉండేవి. కేవలం 6 సంవత్సరాలలో స్టాక్​ మార్కెట్​లో చాలా విజయాలు సాధించారు. 1858 నాటికే దాదాపు రూ. లక్ష సంపాదించారు. 1861లో జరిగిన అమెరికన్ సివిల్ వార్ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పత్తి వ్యాపారానికి భారతదేశాన్ని కేంద్రంగా మార్చి విస్తరించారు. దీంతో  రాయ్‌‌‌‌చంద్ భారీ లాభాలను సంపాదించారు.

అంతర్యుద్ధం ముగిశాక 1865 నుంచి పత్తి వ్యాపారంలో తీవ్రంగా  నష్టాలు వచ్చాయి. దీంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. డబ్బులు లేక ఇబ్బందిపడ్డారు. కొంతకాలానికి తిరిగి పుంజుకుని నష్టాల నుంచి బయటపడ్డారు. సంపాదించడమే కాదు ఎన్నో దానాలు చేశారు. బాంబే విశ్వవిద్యాలయంలోని రాజాబాయి క్లాక్ టవర్‌‌‌‌కు నిధులు సమకూర్చారు. బాలికల విద్య కోసం నగదు సాయం చేశారు. అవార్డులకు, స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌కు నిధులు ఇచ్చారు. ఆయన బైకుల్లాలోని ఒక బంగ్లాలో ఉండేవారు. కొంతకాలం తరువాత దానిని అనాథాశ్రమంగా, స్కూలుగా మార్చారు.  ప్రేమ్‌‌‌‌చంద్ 1906లో మరణించారు. ఆయన కుటుంబంలోని నాలుగో తరం ఇప్పుడు ప్రేమ్‌‌‌‌చంద్ రాయ్‌‌‌‌చంద్ అండ్ సన్స్ (పీఆర్​ఎస్​)ని నడుపుతోంది. వ్యాపార పరంగా ఒక చిన్న సంస్థే కానీ గొప్ప చరిత్ర కలిగిన కంపెనీ.