అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ తొలిరోజు వర్షార్పణం అయ్యింది. ఈ నేపథ్యంలో తొలి రోజు టాస్ కూడా వేయకపోవడంతో ప్లేయింగ్ ఎలెవన్ గురించి టీమిండియా పునరాలోచించుకోవాలని లెజెండ్ సునీల్ గవాస్కర్ సూచించాడు. మ్యాచ్ జరగనున్న ఏజెస్బౌల్లో గురువారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నందున వాతావరణం మారిపోయిందని గవాస్కర్ అన్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అదనపు బ్యాట్స్మన్ను తీసుకోవడం ఉత్తమమన్నాడు.
‘భారత్ నిన్న టీమ్ను ప్రకటించింది. అయితే టాస్ వేయలేదు. ఇరు జట్ల కెప్టెన్లు ఫైనల్ టీమ్కు సంబంధించిన షీట్లను మార్చుకోలేదు. ఇప్పటికీ తుది జట్టును మార్చుకునే అవకాశం ఉంది. వర్షం పడినందున పరిస్థితులు కివీస్కు లాభిస్తాయి. కాబట్టి భారత్ ఓ స్పిన్నర్ను దించేసి అదనంగా ఒక బ్యాట్స్మన్ను ఆడించాలి. రెండు జట్లలో అద్భుతమైన బౌలర్లు ఉన్నందున ఎవరు టాస్ గెలిచినా బౌలింగ్నే ఎంచుకుంటారు. బౌలింగ్ తీసుకున్న జట్టు తొలి గంటలో మూడ్నాలుగు వికెట్లు పడగొడితే మ్యాచ్ వాళ్ల నియంత్రణలో ఉంటుంది’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.