- దారుణంగా కొట్టి మమ్మల్ని దోచుకున్నారు
- దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాం
- జార్ఖండ్లో అత్యాచారానికి గురైన స్పెయిన్ పర్యాటకురాలి వెల్లడి
దుమ్కా : జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో అత్యాచారానికి గురైన స్పెయిన్ పర్యాటకురాలు ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెల్లడించింది. దుండగులు తనతో పాటు తన పార్ట్ నర్ గొంతుపై కత్తిపెట్టి బెదిరించారని, ఇద్దరినీ దారుణంగా కొట్టి తనను రేప్ చేశారని తెలిపింది. దేవుడి దయ వల్ల తామిద్దరూ బతికి బయటపడ్డామని చెప్పింది. దుండగులు తమపై ఏవిధంగా అఘాయిత్యానికి పాల్పడ్డారో వివరిస్తూ బాధితురాలు తన ఇన్ స్టాగ్రాం అకౌంట్ లో ఓ వీడియో పోస్టు చేసింది. ‘‘కళ్లు తెరిచి చూస్తే మేము ఆసుపత్రిలో ఉన్నాం. ఆరోజు రాత్రి జరగకూడనిది మాకు జరిగింది.
ఇతరులకు అలాంటి ఘోరం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నం. దుమ్కా జిల్లాలో కురుమహత్ ఏరియాలో రాత్రి రోడ్డు పక్కన టెంట్ వేసుకున్నాం. కాసేపటి తర్వాత ఏడుగురు వ్యక్తులు మా టెంట్ వద్దకు వచ్చారు. మమ్మల్ని తీవ్రంగా కొట్టి దోచుకున్నారు. నాతో పాటు నా పార్ట్ నర్ గొంతుపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించారు. తర్వాత నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరోజు రాత్రి ఇండియాలో ఆ దారుణమైన ఘటన మాకు జరిగింది. దేవుడి దయ వల్ల మేము బతికిపోయాం” 28 ఏండ్ల పర్యాటకురాలు ఆ వీడియోలో వివరించింది.
తన ముఖానికి అయిన గాయాలను ఆమె చూపింది. పోస్టు చేసిన కాసేపటికే ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే, ఆ వీడియోతో దర్యాప్తుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, దయచేసి వీడియోను డిలీట్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేయడంతో ఆ వీడియోను బాధితురాలు తొలగించింది. ఇన్ స్టాలో ఆమెకు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆమెతో పాటు ఆమె పార్ట్ నర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నలుగురు నిందితులు అరెస్టు
అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను గుర్తించామని, వారిలో నలుగురిని అరెస్టు చేశామని జార్ఖండ్ డీజీపీ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. దుండగుల దాడిలో గాయపడిన ఆ విదేశీ పర్యాటకులు ప్రమాదం నుంచి బయటపడినట్లు డాకర్లు వెల్లడించారని డీజీపీ చెప్పారు.