న్యూఢిల్లీ: నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) అప్డేషన్ కోసం ప్రశ్నాపత్రం సిద్ధమైంది. గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన ట్రయల్లో అధికారులు ఉపయోగించిన మోడల్ పేపర్నే ఫైనల్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్టులో మొత్తం 74 జిల్లాల్లోని 30 లక్షల మంది వివరాలు సేకరించారు. దీనికి ప్రజల స్పందన బాగుందని, పెద్దగా అభ్యంతరాలు వ్యక్తంకాలేదని సమాచారం. దీంతో ఏప్రిల్లో సెన్సస్ తో పాటే చేపట్టనున్న ఎన్పీఆర్లో ఇదే పేపర్ను వాడాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ పేపర్లో.. తల్లిదండ్రుల పుట్టిన ప్రదేశం సహా మొత్తం 21 ప్రశ్నలు పొందుపరిచారు. ఆధార్ కార్డు(ఆప్షనల్), ఓటర్ ఐడీ, మొబైల్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్తదితర వివరాలను కూడా సేకరిస్తారు.
పదేళ్ల క్రితం సేకరణ
పాపులేషన్ రిజిస్టర్ కోసం 2010లో వివరాలు సేకరించినట్లు అధికారులు చెప్పారు. అప్పట్లో కేవలం 15 అంశాలకు సంబంధించిన వివరాలనే సేకరించినట్లు తెలిపారు. తర్వాత ఆ రిజిస్టర్ను 2015లో అప్డేట్ చేశామన్నారు. ఈసారి 21 అంశాలపై వివరాలు సేకరించనున్నట్లు వివరించారు.
ఏమేం ప్రశ్నలు ఉంటయ్
పేరు, కుటుంబ యజమానితో బంధుత్వం, తల్లిదండ్రుల పేర్లు, భార్య/భర్త పేరు, జెండర్, పుట్టిన రోజు, ప్రదేశం, వైవాహిక స్థితి, జాతీయత, చిరునామా, ఎప్పట్నుంచి ఉంటున్నారు.. శాశ్వత చిరునామా, ఆక్యుపేషన్, విద్యార్హతలకు సంబంధించి మొత్తం 21 ప్రశ్నలు
ముందే చెప్పి వెళతాం
ఎన్పీఆర్లో భాగంగా సమాచార సేకరణకు వెళ్లే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తామని అధికారులు చెప్పారు. ఒక కుటుంబంలో 15 మంది, అంతకు మించి సభ్యులు ఉంటే ముందు నోటీసు ఇచ్చి ఆ తర్వాతే వెళతామన్నారు. దీనివల్ల అవసరమైన డాక్యుమెంట్లను వారు సిద్ధం చేసుకునేందుకు వీలుంటుందని వివరించారు. ఆ డాక్యుమెంట్లను ఎన్యుమరేటర్ పరిశీలిస్తారని చెప్పారు.