హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారీ కోసం ప్రాథమికంగా ఒక్కొకరికి పది రకాల టెస్టులు చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ఇందులో కొన్ని టెస్టులు ఊళ్లలో క్యాంపులు పెట్టి చేయనుండగా, మరికొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో చేయనున్నారు. ఏయే టెస్టులు చేయాలన్నదానిపై రూపొందించిన నివేదికను హెల్త్ డిపార్ట్మెంట్ మంగళవారం ప్రభుత్వానికి అందజేసింది. ఈ టెస్టులు చేయడానికి అవసరమైన మెషినరీ, టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలని కోరింది. టెస్టులకు అవసరమైన కిట్లు, మెషినరీ కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రానున్న 20 రోజుల్లో కొనుగోలు పూర్తి చేస్తామని హెల్త్ ఆఫీసర్ ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. సెప్టెంబర్ చివర్లో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్గా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల సర్వేను వంద రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఓ జిల్లా సర్వేకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మరో జిల్లా సర్వేకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్రెడ్డి ఇన్చార్జులుగా వ్యవహరించనున్నారు.
టెస్టులు ఇవే
ఊళ్లలో జరిగే క్యాంపుల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు పాల్గొంటారు. ఈ క్యాంపుల్లో ఎత్తు, బరువు, జబ్బ చుట్టుకొలత(న్యూట్రిషనల్ అసెస్మెంట్ కోసం), కాటరాక్ట్, ఓరల్ కావిటి, బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ లెవల్స్ చెక్ చేస్తారు. ఇదివరకే ఏమైనా జబ్బులు ఉంటే వాటిని కూడా రికార్డుల్లో నమోదు చేస్తారు. కొలెస్ర్టాల్ లెవెల్, హియరింగ్ టెస్ట్ వంటివి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో చేస్తారు. ఆయా వ్యక్తులకు ఇదివరకే ఉన్న జబ్బుల ఆధారంగా కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్, ఈసీజీ, స్కిన్ థిక్నెస్(న్యూట్రిషనల్ అసెస్మెంట్ కోసం) వంటి టెస్టులు కూడా చేయాలని నిర్ణయించారు. పీహెచ్సీల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
ఆధార్ నంబరే హెల్త్ ఐడీ
హెల్త్ ప్రొఫైల్ కోసం ప్రతి వ్యక్తి వద్ద ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ వివరాలు సేకరించనున్నారు. ఆధార్ నంబర్నే ఐడీ సంఖ్యగా వినియోగించి హెల్త్ప్రొఫైల్ రూపొందిస్తారు. ఈ ఐడీని ఫోన్ నంబర్కు అనుసంధానిస్తారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య వివరాలను చూడ్డానికి, పోర్టల్లో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే ప్రొఫైల్లోనే వివరాలను చూడటానికి యాక్సెస్ ఉంటుంది. కొంత సేపటి తర్వాత ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతుంది. డేటా మిస్ యూజ్గాకుండా ఉండేందుకు ఓటీపీ ప్రక్రియను తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఆన్లైన్ ప్రక్రియంతా చేయడానికి ఐటీ శాఖకు బాధ్యతలు అప్పగించారు.
సగం పని పూర్తి
రాష్ర్టంలోని 2 కోట్ల మంది వివరాలు వివిధ రూపాల్లో హెల్త్ డిపార్ట్మెంట్ వద్ద అందుబాటులో ఉన్నాయి. హెల్త్ ప్రొఫైల్ కోసం ఈ వివరాలన్నీ ఉపయోగించు కోనున్నారు. ఉదాహరణకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్ర్కీనింగ్లో భాగంగా 1.2 కోట్ల మందికి బీపీ, షుగర్ టెస్టులు చేశారు. ఇందులో 20 లక్షల మందికి రోగాలున్నట్టు తేలింది. వాళ్ల పేర్లు, ఆధార్, ఫోన్ నంబర్లు ఆరోగ్యశాఖ వద్ద ఉన్నాయి. కంటి వెలుగు క్యాంపుల్లో నూ 1.54 కోట్ల మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వ దవాఖాన్లలో ప్రసవాలు చేయించుకుంటున్న మహిళల వివరాలు కేసీఆర్ కిట్ పోర్టల్లో ఉన్నాయి. వివిధ సర్జరీలు చేయించుకున్న వాళ్ల రికార్డులు ఉన్నాయి. లక్షన్నర మంది కేన్సర్ రోగుల వివరాలు ఎంఎన్జే హాస్పిటల్లో ఉన్నాయి. ఇలా వేర్వేరుగా ఉన్న డేటా మొత్తాన్ని ఆన్లైన్ చేసి, మెర్జ్ చేయాలని నిర్ణయించారు.