
- ప్రారంభించనున్న మంత్రులు హరీశ్రావు, కేటీఆర్
- 398 టీమ్స్ రెడీ.. టీమ్లో ఏఎన్ఎం, ఇద్దరు ఆశావర్కర్లు
- రోజుకు 40 మందికి టెస్టులు
- ఏప్రిల్ చివరి నాటికి సర్వే పూర్తి చేయాలని టార్గెట్
- పైలట్ ప్రాజెక్ట్ ఫలితం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల కలెక్టరేట్, హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శనివారం ములుగులో మంత్రి హరీశ్రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఈ సర్వేను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా రెండు జిల్లాల్లో 18 ఏండ్లు నిండిన 7 లక్షల మందికి పలు రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు.
ఇందుకోసం సిరిసిల్ల జిల్లాలో 245, ములుగు జిల్లాలో 153 హెల్త్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఈ సర్వే ప్రక్రియను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని హెల్త్ ఆఫీసర్లు టార్గెట్గా పెట్టుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్లో వచ్చే సాధకబాధకాలను గుర్తించి, మార్పులు చేర్పుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టనున్నారు. మరోవైపు మంత్రుల పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా జిల్లాల ఆఫీసర్లు పూర్తి చేశారు. ములుగు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చడమే కాకుండా రేడియాలజీ ల్యాబ్ భవన నిర్మాణాలకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేస్తారు. పిల్లల ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. తర్వాత నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్లో సర్వేకు పచ్చజెండా ఊపిన తర్వాత.. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్, పాలియేటివ్ కేర్ సెంటర్లను కేటీఆర్ ప్రారంభిస్తారు.
గ్రామానికి రెండు బృందాలు
ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ సర్వే కోసం వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు 398 టీమ్స్ను ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలో 9 మండలాలకు 153, సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలకు 245 టీమ్స్ పనిచేయనున్నాయి. పీహెచ్సీలు, సబ్ సెంటర్లలోని డాక్టర్లు, స్టాఫ్ నర్స్లు, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఇందులో పాల్గొననున్నారు. ప్రతి మండలంలో గ్రామానికి రెండు బృందాలను కేటాయించినట్లు ఆఫీసర్లు చెప్పారు. ఒక్కో టీంలో ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశావర్కర్లను నియమించారు. ఆయా జిల్లాల్లో నియమించిన టీంలను పీహెచ్సీ వైద్యాధికారులు మానిటర్ చేస్తారు. వారిని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్వో) పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఆయా మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీస్లర్లు, వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లతో ఆయా జిల్లాల కలెక్టర్లు సమీక్షలు నిర్వహించారు.
రోజుకు 40 మందికి టెస్టులు
ఒక్కో టీం రోజుకి 40 మందిపై సర్వే చేస్తుంది. ప్రతి టీమ్ ఇంటింటికీ తిరిగి ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్ తీసుకుని ఆ వివరాలను ఆరోగ్య తెలంగాణ ఈ హెల్త్ ప్రొఫైల్ యాప్లో ఎంటర్ చేసి, అప్పటికప్పుడు హెల్త్ ప్రొఫైల్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఎత్తు, బరువు కొలుస్తారు. గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఉంటే అవి ఏవి అనేది ప్రజలను అడిగి తెలుసుకుంటారు. బీపీ, షుగర్, టీబీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాటి వివరాలను సేకరిస్తారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని, టెస్టుల కోసం సమీపంలోని డయాగ్నస్టిక్ హబ్కు పంపిస్తారు. అక్కడ సీబీపీ, సీబీసీ, రుమటాయిడ్ ఫ్యాక్టర్, షుగర్, హెచ్ఐవీ, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ వంటి టెస్టులన్నీ చేసి, వాటి రిపోర్ట్లను యాప్లో ఆయా వ్యక్తుల అకౌంట్లో అప్లోడ్ చేస్తారు. భవిష్యత్తులో ఏవైనా సమస్యలుంటే హెల్త్ ప్రొఫైల్ ద్వారా చెక్ చేసి అవసరమైన చికిత్స అందించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది.
మెడికల్ కిట్లు అందజేత
ఒక్కో హెల్త్ టీమ్కు రెండు బ్యాగులను ఆఫీసర్లు అందజేశారు. ఒక బ్యాగ్లో బీపీ ఆపరేటర్, గ్లూకో మీటర్, హిమోగ్లోబిన్ మీటర్, థర్మామీటర్, పల్స్ ఆక్సీమీటర్, టార్చ్ లైట్, హైట్ మెజర్ స్కేల్, టార్నీక్వైట్, శానిటైజర్, కాటన్, గ్లౌజులు, మాస్క్లు ఉంటాయి. ఇంకో బ్యాగ్లో వెయిట్ మిషన్, వ్యాక్యూ టైనర్, గ్లూకో స్ర్ట్రిప్స్, జిప్ లాక్ కవర్స్, బ్యాండ్ ఎయిడ్, స్పిరిట్, నీడిల్స్, వేస్ట్ బాక్స్, బార్ కోడ్ లేబుల్స్, రబ్బర్ బాండ్ ప్యాకెట్, పెన్ మార్కర్, హౌజ్ స్టిక్కర్స్ ఉంటాయి.