కవిత పిటిషన్​పై విచారణ మార్చి 13కు వాయిదా

కవిత పిటిషన్​పై విచారణ మార్చి 13కు వాయిదా

 న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి  చర్యలు తీసుకోకుండా చూడాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మార్చి 13కు వాయిదా పడింది. ఆ రోజు చేపట్టే తుది విచారణకు సిద్ధం కావాలని ను సుప్రీంకోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనకు జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని కోరుతూ గతేడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 గతంలో ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసింది. ఈ పిటిషన్లు బుధవారం జస్టిస్‌‌‌‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌‌‌‌ పంకజ్‌‌‌‌ మిత్తల్‌‌‌‌  బెంచ్ ముందు లిస్ట్ అయ్యాయి. అయితే ఇతర పిటిషన్ల పై విచారణతో సమయం లేకపోవడంతో కవిత పిటిషన్ బెంచ్ ను రీచ్ కాలేదు. 

కాగా కవిత తరపు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కవిత పిటిషన్ విషయాన్ని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చిందని, కావున పిటిషన్ పై త్వరగా విచారణ చేట్టాలని కపిల్ సిబల్ అభ్యర్థించారు. తదుపరి విచారణకు రెండు రావాల టైం కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ప్రస్తుతం సమయం లేనందున రెండు వారాల తర్వాత విచారిస్తామని, ఈలోపు ఇరుపక్షాలు తుది వాదనలకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది.