- ముందు జాగ్రత్త ఏదీ?
- రోగ నివారణను పట్టించుకోని రాష్ట్ర సర్కార్
- రోగం ముదిరే వరకూ తెలుసుకోలేకపోతున్న బాధితులు
- కేంద్రం చేసే స్ర్కీనింగ్లే తప్ప.. శ్రద్ధ చూపని రాష్ర్ట సర్కార్
- కంటి వెలుగు చేసినా నడిమిట్లనే వదిలేసిన వైనం
హైదరాబాద్, వెలుగు : ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్’.. ఇదీ మెడిసిన్లో ముఖ్యమైన నానుడి. అంటే, జబ్బులొచ్చాక ట్రీట్మెంట్ చేయడం కన్నా, ఆ జబ్బు రాకుండా జాగ్రత్తపడాలన్నది దాని అర్థం. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో దానికి భిన్నమైన పరిస్థితులున్నాయి. అసలే ఇది వర్షాకాలం. జబ్బుల కాలం. రోగాలు విజృంభించే టైం అని అందరికీ తెలుసు. కానీ, ప్రభుత్వానికి మాత్రం అదేం పట్టినట్టు లేదు. జబ్బులు రాకుండా నివారణ చర్యలు తీసుకోలేదు. దోమలను నివారించడంగానీ, జబ్బులపై జనానికి అవగాహన కల్పించడంలోగానీ పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో లక్షల మంది జ్వరాలకు బాధితులయ్యారు. వేల మంది డెంగీ, మలేరియాతో బాధపడుతున్నారు. ఆయా జ్వరాలకు ట్రీట్మెంట్ కోసం రాష్ట్రంపై వందల కోట్ల రూపాయల భారం పడుతోంది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలొదిలారు. ఆదిలాబాద్, ఖమ్మం వంటి మారుమూల జిల్లాల్లో కన్నా కూడా హైదరాబాద్, మేడ్చల్ వంటి సిటీ ఏరియాల్లోనే జ్వరాల బాధితులు ఎక్కువగా ఉన్నారు. జ్వరాలతో పాటు షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ రోగాలు రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదని వైద్య, ఆరోగ్య రంగ నిపుణులు అంటున్నారు.
హెల్త్ ప్రొఫైల్ ఏమైంది!
కంటి వెలుగు కార్యక్రమం ప్రాంభించినప్పుడు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఐదారేళ్ల వయసోళ్లకే కంటి సమస్యలు వస్తున్న తరుణంలో ముందస్తు స్క్రీనింగ్ చేయడం మంచిదని భావించి ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. కానీ, ఆ కార్యక్రమం అసంపూర్తిగానే మిగిలిపోయింది. రోగం ఉందని గుర్తించినా, దానికి ట్రీట్మెంట్ చేయకుండానే వదిలేసింది. సుమారు 9 లక్షల మందికి ఆపరేషన్లు చేయాలని డాక్టర్లు గుర్తించినా, అవేం లేకుండానే అటకెక్కించింది. కంటి వెలుగులాగే ఈఎన్టీ(చెవి, ముక్కు, గొంతు) పరీక్షలు కూడా చేయిస్తామని ఫస్ట్ టర్మ్ నుంచే చెబుతున్నా, ఆ దిశగా ఇప్పటికీ చర్యలు లేవు. ఆరోగ్య పరీక్షలన్నీ చేయించి, హెల్త్ ప్రొఫైల్ తయారు చేయిస్తామని చెప్పినా, సీఎం సొంతూరు చింతమడక వరకే అది పరిమితమైంది. రాష్ర్టం మొత్తం హెల్త్ ప్రొఫైల్ చేయించాలంటే వందల కోట్లు ఖర్చు అవుతుంది. ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయనుకుంటే, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
కేంద్రం స్క్రీనింగ్ టెస్టులు
దేశవ్యాప్తంగా కామన్గా వచ్చే రోగాలపై నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్క్రీనింగ్ చేయిస్తోంది. రాష్ర్టంలో బీపీ, షుగర్, కేన్సర్, గుండె వ్యాధుల స్ర్కీనింగ్ చేస్తున్నారు. అయితే, మన రాష్ర్టంలో ఎక్కువగా నమోదవుతున్న కిడ్నీ జబ్బులు, హెపటైటిస్ వంటి వాటిపై రాష్ర్ట ప్రభుత్వం ఎలాంటి స్క్రీనింగ్ చేయించట్లేదు. ఇటీవల అసెంబ్లీలోనూ పలువురు ఎమ్మెల్యేలు స్ర్కీనింగ్ టెస్టులు చేయించాలని సర్కారుకు సూచించారు.
జబ్బుల ట్రెండ్స్ తెలుసుకోవాలె
విదేశాల్లో ప్రివెంటివ్ మెడిసిన్ టాప్లో ఉంటుంది. మన దగ్గర మాత్రం అస్సలు పట్టించుకోరు. నివారణ చర్యలు తీసుకుంటే హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్లు, అవసరమైన సౌకర్యాలూ ఉన్నాయి. వాటిని సరిగ్గా వాడుకుని జబ్బుల ట్రెండ్పై అధ్యయనం చేయొచ్చు.
– డాక్టర్ విజయేందర్, సోషల్ అండ్
ప్రివెంటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్