
- కూలిన చెట్లు, విరిగిన కరెంట్ పోల్స్
- నేల రాలిన మామిడి కాయలు
- రోడ్లపై, మార్కెట్ లో పోసిన ధాన్యం నీటిపాలు
వరంగల్, హసన్ పర్తి, జనగామ, కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి మొదలైన గాలులకు దుమ్ము దూళితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సిటిలో కాకతీయ యూనివర్సిటీ, పలివెల్పుల, భీమారం, రామారం ఏరియాల్లో కరెంట్ వైర్లు తెగిపోగా.. మంగళవారం ఉదయం రిపేర్ చేశారు. సిటీ రింగ్ రోడ్ వెంట ఉన్న ముచ్చర్ల, పెగడపల్లి, రెడ్డిపురం, పలివెల్పుల, వంగాపహడ్, ఉర్సు గుట్ట, బట్టుపల్లి, కడిపికొండ గ్రామాల్లో అకాల వర్షానికి ధాన్యం చాలా దూరం కొట్టుకుపోయాయి.
రాయపర్తి, కాట్రపల్లి, పర్వతగిరి, వడ్లకొండ గ్రామ పరిధిలోని మామిడి తోటల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది.. తీవ్ర గాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. ఇన్నర్ రింగ్ రోడ్ల వెంట రైతులు పోసుకున్న వడ్లు తడిసిపోయాయి. ధాన్యం కుప్పలు ఉన్నచోట నుంచి 100 నుంచి 200 మీటర్ల వరకు ధాన్యం కొట్టుకుపోయాయి. మంగళవారం హనుమకొండ జిల్లా 65 డివిజన్ ఎల్లాపూర్ ఐకేపీ సెంటర్లో తడిసిన ధాన్యాన్ని హనుమకొండ డీసీఓ సంజీవరెడ్డి పరిశీలించి మాట్లాడుతూ.. తడిసిన ధాన్యం కొనే బాధ్యత తీసుకుంటామాన్నారు.
జనగామ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. పాలకుర్తి మండలం మైలారంలో మామిడికాయలు రాలిపోయాయి. వరంగల్ సిటీలో గాలివాన బీభత్సానికి పోల్స్, చెట్లు పడిపోయాయి. బల్దియా మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. విరిగిన చెట్లను తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, బల్దియా సిబ్బంది ఉన్నారు.