హైదరాబాద్, వెలుగు: హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 23న నిర్వహించే ర్యాలీకి షరతులతో అనుమతి ఇవ్వాలని సిటీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. లా అండ్ అర్డర్ సమస్య రాకుండా షరతులు విధించాలని స్పష్టం చేసింది. ర్యాలీలో వంద బైక్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించింది. ఉదయం 10 గంటలకు మొదలు పెట్టి మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీ ముగించాలని తెలిపింది. డీజే సౌండ్స్ ఉండకూడదని..రాజకీయ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని చెప్పింది. షరతులను ఉల్లంఘిస్తే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి గురువారం పేర్కొన్నారు.
హనుమాన్ విజయయాత్ర ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర భజరంగ్ సేన అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ రావు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హనుమాన్ వ్యాయామశాల నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ జరిపేందుకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ ప్లీడర్ వాదిస్తూ.. పిటిషనర్ కోరినట్లుగా అనుమతిస్తే శాంతి భదత్రల సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనల తర్వాత.. షరతులతో అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించి పిటిషన్పై విచారణను ముగించింది.