
- ఫోన్ ట్యాపింగ్ కేసు కవరేజీలో మీడియా సంయమనం పాటించాలి: హైకోర్టు
- సుమోటోగా స్వీకరించిన కేసుపై విచారణ ఈ నెల 23కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వార్తల ప్రచురణ, ప్రసారంలో అప్రమత్తంగా ఉండాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు హైకోర్టు సూచన చేసింది. గత వారం పత్రికల్లో న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లను ప్రచురించినట్టు గుర్తించామని తెలిపింది. ఇకనైనా ఈ వార్తల కవరేజీలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంయమనం పాటిస్తాయని విశ్వసిస్తున్నామని వ్యాఖ్యానించింది.
ఎస్బీఐ అదనపు ఎస్పీ (సస్పెండెడ్) భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ నేతలతో పాటు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని పత్రికల్లో కథనాలు రావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై హైకోర్టు సీజే అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే కౌంటరు దాఖలు చేశామని తెలిపారు. కేంద్రం తరఫున కౌంటరు దాఖలుకు గడువు కావాలని న్యాయవాది కోరారు.
వాదనలను విన్న ధర్మాసనం కేంద్రం కౌంటరు దాఖలు చేయాల్సి ఉన్నందున ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడంలేదని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మీడియాకు పలు సూచనలు చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని, జడ్జిలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు బహిర్గతం చేయొద్దని స్పష్టం చేసింది. అలాగే, వారి ఫోన్ నంబర్లు, ఫొటోలు ప్రచురించొద్దని సూచించింది.