
హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో వడ్లను ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ధాన్యం సేకరించేందుకు అనుసరించే విధానం ఏమిటో చెప్పాలని ఆదేశించింది. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు సాగక రైతులు కష్టాలు పడుతున్నారంటూ లా స్టూడెంట్ బి.శ్రీకర్ వేసిన పిల్ను సోమవారం చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిల డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో డిసెంబర్ 6న జరిగే విచారణ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 40 లక్షల టన్నుల బియ్యాన్ని 2021–2022లో కొనుగోలు చేస్తామని ఈ ఏడాది ఆగస్టు 17న రాష్ట్రం చెప్పిందని, కానీ ఖరీఫ్లో పండిన వడ్లనే కొనడం లేదని పిటిషనర్ లాయర్ వాదించారు.