
- నేటి నుంచి హైలెవల్ కమిటీ విచారణ
యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్ ప్రతిష్టకు చింతపండు దొంగతనం మచ్చతెచ్చింది. చోరీ జరిగి 20 రోజులైనా.. అసలు దొంగలెవరో ఇంకా బయటపడలేదు. ఈ ఘటనపై మొదట వేసిన ఫైవ్మేన్ కమిటీ రిపోర్ట్ను పక్కన పెట్టి.. మరో హైలెవల్ కమిటీని నియమించారు. సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్న హైలెవల్ కమిటీ అయినా అసలు దోషులెవరన్నది తేలుస్తుందా అన్న చర్చ సాగుతోంది.
అసలేం జరిగింది..
గత నెల 28 తెల్లవారుజామున ఓ కారు కొండపై ప్రసాద విక్రయశాల దగ్గరకొచ్చింది. అదే టైమ్కు ప్రసాద తయారీ కేంద్రంలోని కన్వేయర్ బెల్ట్మీద 10 చింతపండు బస్తాలు బయటకు వచ్చాయి. రాత్రి 2.25 గంటలకు ఆ బస్తాలను ఇద్దరు వ్యక్తులు కారులో సర్దుతుండగా పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు. దాంతో కారును, చింతపండు బస్తాలను అక్కడేవదిలి వారు పరారయ్యారు. వారి వెంబడించి ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. టెంపుల్లో పని చేస్తున్న మధు, గణేశ్గా వారిని గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రసాదాల తయారీ సెంటర్ గుమాస్తా, సూపరింటెండెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ దొంగతనం వెనుక ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కమిటీ విచారణ
ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో విచారణ కోసం ఐదురుగు దేవాలయ ఉద్యోగులతో ఒక కమిటీని నియమించారు. గతంలో ఇలాంటి ఘటనలైమైనా జరిగాయా.. కారు కొండపైకి ఎప్పుడు వచ్చింది.. ఏ రూట్లో వచ్చిందన్న అంశాలపై ఫైవ్ మెన్ కమిటీ ఆరా తీసింది. పోలీసులకు పట్టుబడిన మధు, గణేశ్లతో పాటు ప్రసాద విక్రయ శాల, స్టోర్ రూమ్సిబ్బంది వ్యవహారశైలి గురించి, స్టోర్ రూమ్ నుంచి ప్రసాదం తయారీకి సరుకుల సరఫరాలపై విచారణ జరిపింది.ప్రసాదాల కేంద్రం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో దొంగతనం జరిగినప్పటి విజువల్స్ రికార్డ్ కాలేదని గుర్తించింది. కమిటీ తన విచారణ రిపోర్ట్ను ఈ నెల మొదటివారంలో ఈవో వెంకట్రావుకు అందించింది.
రిపోర్ట్పై అసంతృప్తి
ఫైవ్మెన్ కమిటీ రిపోర్ట్ అసంపూర్ణంగా ఉందని ఈవో వెంకటరావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో తిరిగి విచారణ జరిపేందుకు ఈవో వెంకటరావు ఉన్నతాధికారులతో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలరీజనల్ జాయింట్ కమిషనర్, సికింద్రాబాద్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఇందులో సభ్యులు. ఈ కమిటీ సోమవారం నుంచి విచారణ జరపనుంది. ఫైవ్మెన్ కమిటీ రిపోర్ట్ను కూడా ఈ కమిటీ పరిశీలించి మరింత లోతుగా విచారణ జరపనుంది.
గతంలోనూ అవకతవకలు
ప్రసాద విక్రయాలకు సంబంధించి గతంలో కూడా అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి ఈవో భాస్కర్రావు ప్రసాద విక్రయ సెంటర్లో టికెట్కౌంటర్, ప్రసాదాలు అందించే కౌంటర్లను వేరు చేశారు. ఏండ్లుగా ఇక్కడే ఉన్న స్టాఫ్ను ఇతర టెంపుల్స్కు బదిలీ చేశారు. అయినా అక్రమాలు ఆగలేదని అంటున్నారు. చింతపండు దొంగతనంతో మరోసారి ఆలయంలో భద్రతపై అనుమానాలు పెరిగాయి. ప్రసాద తయారీ సెంటర్లో విలువైన బాదం, కిస్మిస్, నెయ్యి వంటి సరుకులు మాయం జరిగే అవకాశముందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ. కోట్లు ఖర్చు చేసి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేశారు. దాని భద్రతలోనూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కారకులు ఎవరైనా చర్యలు
చింతపండు దొంగతనం ఘటనను సీరియస్గా తీసుకున్నాం. ఫైవ్ మెన్ కమిటీ ఇచ్చిన నివేదిక సమగ్రంగా లేదు. అందుకే హైలెవల్ కమిటీతో విచారణ చేయిస్తున్నాం. ఈ ఘటన వెనుక ఏ స్థాయి ఎంప్లాయిస్ ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
వెంకట్రావు, ఈవో, యాదగిరిగుట్ట