మే 28న ‘యాదగిరిగుట్ట’లో చింతపండు దొంగతనం .. దొంగలెవరో తేలేనా ?

మే 28న ‘యాదగిరిగుట్ట’లో చింతపండు దొంగతనం .. దొంగలెవరో తేలేనా ?
  • నేటి నుంచి హైలెవల్​ కమిటీ విచారణ

యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్​ ప్రతిష్టకు చింతపండు దొంగతనం మచ్చతెచ్చింది. చోరీ జరిగి 20 రోజులైనా.. అసలు దొంగలెవరో ఇంకా బయటపడలేదు. ఈ ఘటనపై మొదట వేసిన ఫైవ్​మేన్​ కమిటీ రిపోర్ట్​ను పక్కన పెట్టి.. మరో హైలెవల్​ కమిటీని నియమించారు. సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్న హైలెవల్ కమిటీ అయినా అసలు దోషులెవరన్నది తేలుస్తుందా అన్న చర్చ సాగుతోంది. 

 అసలేం జరిగింది.. 

గత నెల 28 తెల్లవారుజామున ఓ కారు కొండపై ప్రసాద విక్రయశాల దగ్గరకొచ్చింది. అదే టైమ్​కు ప్రసాద తయారీ కేంద్రంలోని కన్వేయర్​ బెల్ట్​మీద 10 చింతపండు బస్తాలు బయటకు వచ్చాయి. రాత్రి 2.25 గంటలకు ఆ బస్తాలను ఇద్దరు వ్యక్తులు కారులో సర్దుతుండగా పెట్రోలింగ్​ పోలీసులు వచ్చారు. దాంతో కారును, చింతపండు బస్తాలను అక్కడేవదిలి వారు పరారయ్యారు. వారి వెంబడించి ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. టెంపుల్​లో పని చేస్తున్న మధు, గణేశ్​గా వారిని గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రసాదాల తయారీ సెంటర్​ గుమాస్తా, సూపరింటెండెంట్​లకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ దొంగతనం వెనుక ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

 కమిటీ విచారణ 

ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో విచారణ కోసం ఐదురుగు దేవాలయ ఉద్యోగులతో ఒక కమిటీని నియమించారు. గతంలో ఇలాంటి ఘటనలైమైనా జరిగాయా.. కారు కొండపైకి ఎప్పుడు వచ్చింది.. ఏ రూట్​లో వచ్చిందన్న అంశాలపై ఫైవ్​ మెన్ కమిటీ ఆరా తీసింది. పోలీసులకు పట్టుబడిన మధు, గణేశ్​లతో పాటు ప్రసాద విక్రయ శాల, స్టోర్​ రూమ్​సిబ్బంది వ్యవహారశైలి గురించి, స్టోర్​ రూమ్​ నుంచి ప్రసాదం తయారీకి సరుకుల సరఫరాలపై విచారణ జరిపింది.ప్రసాదాల కేంద్రం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో దొంగతనం జరిగినప్పటి విజువల్స్ రికార్డ్​ కాలేదని గుర్తించింది. కమిటీ తన విచారణ రిపోర్ట్​ను ఈ నెల మొదటివారంలో ఈవో వెంకట్​రావుకు అందించింది. 

 రిపోర్ట్​పై అసంతృప్తి 

ఫైవ్​మెన్​ కమిటీ రిపోర్ట్​ అసంపూర్ణంగా ఉందని ఈవో వెంకటరావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో తిరిగి విచారణ జరిపేందుకు ఈవో వెంకటరావు ఉన్నతాధికారులతో హైలెవల్​ కమిటీని ఏర్పాటు చేశారు. ఎండోమెంట్​ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలరీజనల్ జాయింట్ కమిషనర్, సికింద్రాబాద్ ఎండోమెంట్​ అసిస్టెంట్​ కమిషనర్​ ఇందులో సభ్యులు. ఈ కమిటీ సోమవారం నుంచి విచారణ జరపనుంది. ఫైవ్​మెన్​ కమిటీ రిపోర్ట్​ను కూడా ఈ కమిటీ పరిశీలించి మరింత లోతుగా విచారణ జరపనుంది. 

గతంలోనూ అవకతవకలు

ప్రసాద విక్రయాలకు సంబంధించి గతంలో కూడా అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి ఈవో భాస్కర్​రావు ప్రసాద విక్రయ సెంటర్​లో టికెట్​కౌంటర్​, ప్రసాదాలు అందించే కౌంటర్లను వేరు చేశారు. ఏండ్లుగా ఇక్కడే ఉన్న స్టాఫ్​ను ఇతర టెంపుల్స్​కు బదిలీ చేశారు. అయినా అక్రమాలు ఆగలేదని అంటున్నారు. చింతపండు దొంగతనంతో మరోసారి ఆలయంలో భద్రతపై అనుమానాలు పెరిగాయి. ప్రసాద తయారీ సెంటర్లో విలువైన బాదం, కిస్​మిస్​, నెయ్యి వంటి సరుకులు మాయం జరిగే అవకాశముందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ. కోట్లు ఖర్చు చేసి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేశారు. దాని భద్రతలోనూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

కారకులు ఎవరైనా చర్యలు

చింతపండు దొంగతనం ఘటనను సీరియస్​గా తీసుకున్నాం. ఫైవ్ మెన్​ కమిటీ ఇచ్చిన నివేదిక సమగ్రంగా లేదు. అందుకే హైలెవల్​ కమిటీతో విచారణ చేయిస్తున్నాం. ఈ ఘటన వెనుక ఏ స్థాయి ఎంప్లాయిస్​ ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 

 ‌వెంకట్​రావు, ఈవో, యాదగిరిగుట్ట