గువాహటి: అస్సాం, మిజోరాం సరిహద్దులో ఈ నెల 26న జరిగిన అల్లర్లకు సంబంధించి తనపై మిజోరాంపోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సెటైర్ వేశారు. అల్లర్లు తమ రాష్ట్ర భూభాగంలో జరిగితే మిజోరాం పోలీసులు కేసు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ను ఏ ప్రకారం నమోదు చేశారో చెప్పాలన్నారు. అల్లర్లకు సంబంధించి ఎలాంటి విచారణకైనా తాను సంతోషంగా సహకరిస్తానని, అయితే కేసును న్యూట్రల్ ఏజెన్సీకి ఎందుకు అప్పగించలేదని అడిగారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని మిజోరాం సీఎం జోరంతంగకు కూడా చెప్పానన్నారు. అస్సాం, మిజోరాం బార్డర్లో ఈ నెల 26న జరిగిన అల్లర్లలో ఆరుగురు అస్సాం పోలీసులు, ఒక పౌరుడు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి మిజోరాం పోలీసులు వైరెంగ్తే పోలీస్ స్టేషన్లో అస్సాం సీఎం శర్మ, మరో ఆరుగురు అస్సాం అధికారులపై హత్యాయత్నం, కుట్ర పూరిత నేరం, దాడి ఆరోపణల మీద కేసు నమోదు చేశారు. ఆ విషయం శుక్రవారం బయటకు వచ్చింది. కేసు నమోదైన అధికారులందరూ ఆగస్టు 1న పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పారు. మరో 200 మంది అస్సాం పోలీసులపైనా కేసు నమోదైంది. అస్సాం పోలీసులు కూడా మిజోరాంకు చెందిన ఆరుగురు అధికారులకు సమన్లు జారీ చేశారు. ధొలాయ్ పోలీస్ స్టేషన్కు ఆగస్టు 2న హాజరు కావాలన్నారు. మరోవైపు ఆ అల్లర్ల వెనుక తానే ఉన్నానని రాజ్యసభ ఎంపీ కే వన్లల్వెన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయనపై యాక్షన్ తీసుకోవడానికి అస్సాం పోలీస్ టీమ్ ఢిల్లీకి వెళ్లింది. ప్రస్తుతం అస్సాం- మిజోరం బార్డర్లో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.
ఈశాన్య భారతం ఎప్పుడూ ఒకటే
ఈశాన్య భారతం ఎప్పుడూ ఒకటేనని మిజోరాం సీఎం జోరంతంగ అన్నారు. మిజోరాంలోని కొలాస్బి జిల్లా, అస్సాంలోని కచర్ జిల్లా మధ్య ఇతర రాష్ట్రాల పౌరుల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బార్డర్ టెన్షన్ నేపథ్యంలో మిజోరాం వెళ్లొద్దంటూ అస్సాం ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ సూచించడంతో జోరంతంగ ఈ కామెంట్స్ చేశారు.