
మైసూరు చరిత్రకారుల ప్రకారం హైదర్ అలీ మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందినవాడు. హైదర్ అలీ1717లో మైసూర్లోని బుడికోట్లో పుట్టాడు. అతని తండ్రి పేరు ఫతే మహమ్మద్.1749లో హైదర్ మైసూర్ సైన్యంలో తన అన్న షాబాజ్ పలుకుబడితో ఉద్యోగంలో చేరాడు. హైదర్కు భయమంటే తెలియదు. అతని ధైర్యం మైసూర్ అమాత్యులైన నాన్రాజ్ దృష్టిని ఆకర్షించింది. దాంతో ఆయన హైదర్కు మొదటి ప్రమోషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మైసూర్ దళంతో నసీర్ జంగ్కు సాయం చేయడానికి వెళ్లాడు.
అలా నసీర్ జంగ్, హైదరాబాద్ నిజాం ఖాళీ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. కానీ, అతడిని ఫ్రెంచ్వాళ్లు ఓడించి, చంపేశారు. దాంతో మైసూర్ దళాలు వెనుదిరిగాయి. కానీ, హైదర్ అయోమయ పరిస్థితిలో నసీర్ జంగ్ సంపదలో కొంతభాగం దోచుకునేందుకు సాయపడి, సొంత నిధులను సమకూర్చుకున్నాడు. ఆయన 1500 అశ్విక దళం, 3000 కాల్బలాన్ని సమకూర్చుకుని దక్కన్ బ్రాహ్మణుడైన ఖండేరావును కార్యదర్శిగా నియమించుకున్నాడు. 1755లో ఆయన దిండిగల్ గవర్నర్గా ఉద్యోగ ఉన్నతి పొందాడు. అతడు ఆ పదవిని వెంటనే పాండిచ్చేరి ఫ్రెంచి అధికారుల సాయంతో ఎంతో బలోపేతం చేశాడు. ఆ సమయంలోనే ఆయనకు ఫ్రెంచి భాష పట్ల అమితమైన ఇష్టం కలిగింది.
1757లో కొత్త నిజాం సలాబత్ జంగ్, తన ఫ్రెంచి సలహాదారుడు ఎండి. బుస్సీతో కలిసి కప్పం వసూలు చేయడానికి మైసూర్కు వెళ్లాడు. తన సోదరుడైన దేవరాజ్శతృత్వం వల్ల ఆటంకం ఎదురైనప్పటికీ నాన్రాజ్ దేవాలయాలన్నింటినీ దోచుకుని 18 లక్షలు చెల్లించి సలాబత్ జంగ్ను కొనేశాడు. ఆ నిజాం వెళ్లగానే 3వ పీష్వా అయిన బాలాజీ బాజీరావు నేతృత్వంలో మరాఠాలు వచ్చారు. వాళ్లను లక్షల రూపాయలు, విలువైన జిల్లాలను తాకట్టుపెట్టి కొనడంతో మైసూరు ఖజానా ఖాళీ అయింది.
జీతాలు లేకపోవడంతో సిపాయిలు తిరుగుబాటు చేశారు. నాన్రాజ్ హైదర్ అలీకి కబురు పంపాడు. అతని ఆజ్ఞతో ఖండేరావు జాగ్రత్తగా లెక్కలన్నీ తనిఖీ చేసి తిరుగుబాటుదారుల డిమాండ్లను కొంత మొత్తానికి తగ్గించి, 4 వేల మందిని తొలగించి, మిగతా వాళ్లకు, వాళ్ల నాయకులకు ఆస్తులను కొల్లగొట్టి చెల్లించాడు. సైన్యం విధేయత చూపింది. హైదర్ అలీ, పీష్వాతో సంధిని రద్దు చేశాడు.
గోపాలరావు పట్వర్థన్ ఆధ్వర్యంలో మరాఠా దళం మళ్లీ వచ్చింది. హైదర్ అలీ పట్వర్థన్ మీదికి వెళ్లి, తన తెలివితేటలతో అతడు తాకట్టుపెట్టిన జిల్లాలను ఆక్రమించుకోకుండా విఫలం చేశాడు. దాంతో పట్వర్థన్ కొన్ని షరతుల మీద వెనుదిరిగాడు. హైదర్ సాహసాన్ని చూసిన రాజా చిక్కరాజ్ అతనికి కృతజ్ఞత చూపిస్తూ ఫతే హైదర్ బహదూర్ అనే బిరుదు ఇచ్చాడు.
1763లో హైదర్ అలీ బద్నూర్కు తన సంస్థానంలో కలుపుకున్నాడు. ఆ తర్వాత కొత్త పీష్వా మాధవరావు హైదర్ అలీ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఓడించాడు. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి హైదర్ అలీ తన దృష్టిని మలబారు కోస్తా మీదికి మళ్లించాడు. ఆ తర్వాత1767 నుంచి 1769 వరకు మద్రాస్లోని ఇంగ్లిష్ వారితో, ఆర్కాబు నవాబు మొహమ్మద్ అలీతో యుద్ధం చేశాడు. బ్రిటిష్ వారి అధీనంలో ఉన్న ఒక్కొక్క జిల్లాను ఆక్రమించుకుంటూ మద్రాసుకు ఐదు మైళ్ల దూరానికి చేరుకున్నాడు. ఈ సాహసానికి తగిన ప్రతిఫలంగా మద్రాసు ప్రభుత్వం రక్షణ ఒప్పందం చేసుకుంది. ఆ వెంటనే హైదర్ అలీ మరాఠా దండయాత్రను మళ్లీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మరెన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ జయాపజయాలను విస్మరిస్తూ సాహసోపేతంగా ముందుకెళ్లాడు.
1782 జూన్ 2న హైదర్ అలీ చివరి యుద్ధం చేశాడు. అప్పటికే కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 7న చిత్తూర్ శిబిరంలో మరణించాడు. హైదర్ అలీ మైసూర్కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టాడు. నిరక్షరాస్యుడైనా దేశ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించాడు. వారసులకు గొప్ప ఖజానా, సమర్థవంతమైన సైన్యాన్ని ఇచ్చాడు.
- మేకల మదన్మోహన్ రావు, కవి, రచయిత-