మెదక్ టౌన్, వెలుగు: మెదక్లో గుడిసెలు, ఇండ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక హమాలీ కాలనీ వద్ద కొందరు పేదలు గుడిసెలు, ఇండ్లు నిర్మించుకొని ఉంటున్నారు. సోమవారం మున్సిపల్అధికారులు, సిబ్బంది వచ్చి జేసీబీతో వాటిని కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మించుకోవడంతో నోటీసులిచ్చామని, అయినా పట్టించుకోకపోవడంతో కూల్చివేశామన్నారు. ఈ క్రమంలో జేసీబీని అడ్డుకోవడానికి మహిళలు ప్రయత్నించగా మెదక్ టౌన్ సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని పక్కకు తప్పించి ఇండ్లను కూల్చివేశారు.
కొందరు మహిళలు అధికారులపై కారం చల్లడానికి యత్నించగా అడ్డుకున్నారు. ఈ ఘటనలో కమల అనే మహిళ స్పృహ కోల్పోగా పోలీసులు మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మున్సిపల్ కమిషనర్ జానకీ రామ్సాగర్ మాట్లాడుతూ పట్టణంలో అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా కూల్చివేస్తామన్నారు.