- అప్పులు కట్టనోళ్లకూ హక్కులుంటయ్
- ఆస్తుల వేలం ముందు లెండర్లు నోటిస్లివ్వాలి
- ఆస్తులను తగిన ధరకే అమ్మాలి..
- లెండర్లు ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో కాకపోతే డెట్ రికవరీ ట్రిబ్యునల్కు వెళ్లొచ్చు..
బిజినెస్డెస్క్, వెలుగు: చాలా మంది అప్పులు తీసుకొని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు పడుతుంటారు. హోమ్ లేదా కారు లోన్లు వంటి సెక్యూర్డ్ లోన్లు డీఫాల్ట్ అయితే ఫైనాన్షియల్ సంస్థలు (లెండర్లు) బకాయిలను రికవరీ చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాయి. జనరల్గా మోసం చేయాలనే ఉద్దేశం లేకుండా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో డీఫాల్ట్ అయితే వాటిని క్రిమినల్ కేసులుగా చూడాల్సిన అవసరం లేదు. తీసుకున్న లోన్లను తిరిగి చెల్లించడం ముఖ్యమే. కానీ, లోన్లు తిరిగి చెల్లించలేకపోతే బారోవర్ల (అప్పులు తీసుకున్న వారు) అకౌంట్లు మొండి బాకీగా చూస్తారు. బారోవర్ డీఫాల్టర్గా మారినా తనకంటూ కొన్ని హక్కులను ఆర్బీఐ ప్రొవైడ్ చేసింది. వీటిని లెండర్లు కచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది.
బారోవర్ హక్కులు.. లెండర్లు కచ్చితంగా నొటీసులివ్వాలి..
లోన్ డీఫాల్ట్ అయితే మాత్రం భవిష్యత్లో తీసుకునే చర్యలకు సంబంధించి ఒక నోటిస్ను బారోవర్లకు లెండర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ‘ సెక్యూర్డ్ లోన్ల (తనఖా లోన్ల) ను వేలం వేయక ముందు 60 రోజుల నోటిస్ పీరియడ్ను బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఇస్తాయి’ సార్థక్ అడ్వకేట్స్ అండ్ సోలిసిటర్స్ పార్టనర్ మని గుప్తా పేర్కొన్నారు. కాగా, కేవలం ఒక్క నెల రీపేమెంట్ను కట్టలేనంత మాత్రాన బారోవర్ల అకౌంట్లు మొండిబాకీలు (ఎన్పీఏ) గా మారవు. రీపేమెంట్ చెల్లింపులు 90 రోజుల వరకు చేయకపోతే అప్పుడు ఈ అకౌంట్లను ఎన్పీఏగా పరిగణిస్తారు. అంటే మూడు ఈఎంఐలను కట్టకపోతే ఆ అకౌంట్లు మొండిబాకీలు (ఎన్పీఏ) గా మారతాయి. అకౌంట్లు ఎన్పీఏగా ప్రకటించాకనే బారోవర్ల తనఖా ఆస్తులను అమ్మడానికి లెండర్లకు వీలుంటుంది. ‘లెండర్లు ఇచ్చిన 60 రోజుల నోటిస్ పీరియడ్ తర్వాత బారోవర్కు చెందిన తనఖా ఆస్తులను లెండర్లు వేలం వేస్తారు. కానీ, దీనికి ముందు 30 రోజుల టైమ్ పీరియడ్తో పబ్లిక్ నోటిస్ను ఇష్యూ చేయాల్సి ఉంటుంది’ అని కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ సోనమ్ చాంద్వానీ పేర్కొన్నారు. నోటిస్ పీరియడ్ టైమ్లో ఎంతో కొంత అప్పును చెల్లిస్తే ఆస్తులను వేలం వేయకుండా ఆపొచ్చు. లెండర్లతో వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసుకోవడానికి లేదా లోన్ను రీస్ట్రక్చర్ చేసుకోవడానికి బారోవర్కు అవకాశం ఉంటుంది.
ఆస్తుల వేలం వేస్తే తగిన ధర..
తనఖా ఆస్తులను వేలం వేయాలనుకుంటే మాత్రం మార్కెట్ వాల్యూకి తగ్గట్టు ఆ ఆస్తులను అమ్మాల్సి ఉంటుంది. సాధారణంగా తనఖా ఆస్తుల విలువ ఎప్పుడూ లోన్ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ, ఆస్తులను వేలం వేసేటప్పుడు లెండర్లు కేవలం అప్పులను రికవర్ చేసుకోవడంపైనే ఎక్కువగా దృష్టిపెడతారు. దీంతో తక్కువ ధరకే ఆస్తులను వేలం వేసే అవకాశం ఉంటుంది. అందువలన ఆస్తులకు పూర్తి విలువ రాకపోవచ్చు. కానీ, సర్ఫేసీ చట్టం కింద ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ను ఇచ్చింది. వేలం వేసే ముందు లెండర్లు ఆస్తుల వాల్యుయేషన్ను లెక్కించాల్సి ఉంటుంది. వేలం వేసే టైమ్, ఆస్తుల విలువ, రిజర్వ్ ధర వంటి విషయాలను ముందే బారోవర్కు చెప్పాల్సి ఉంటుంది. ఆస్తుల విలువ తక్కువగా లెక్కించారని అనిపిస్తే డెట్ రికవరీ ట్రిబ్యునల్కు వెళ్లి ఆ వేలంపై స్టేను బారోవర్ తెచ్చుకోవచ్చు.
అప్పులు తీర్చాక మిగిలిన డబ్బులు బారోవర్కే..
ఆస్తులను వేలం వేశాక, అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు బారోవర్లకే దక్కుతాయి. ఆస్తుల వేలం ప్రాసెస్ను బారోవర్లు ఫాలో కావడం బెటర్. ఎందుకంటే అప్పులు తీర్చాక మిగిలిన డబ్బులను రిఫండ్ చేయడానికి లెండర్లు ఇష్టపడరు. ఈ రిఫండ్ అమౌంట్ కచ్చితంగా వచ్చేలా బారోవర్లు చూసుకోవాలి. డెడ్లైన్లోపు రిఫండ్ను లెండర్లు చెల్లించలేకపోతే, డెట్ రికవరీ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేయొచ్చు. దీంతో పాటు బ్యాంకింగ్ అంబుడ్స్మన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు.
లోన్ రికవరీలో దురుసు ప్రవర్తనపై ఫిర్యాదు..
లెండర్లు లోన్ను రికవరీ చేసే టైమ్లో బారోవర్లతో దురుసుగా ప్రవర్తించకూడదు. రికవర్ ఏజెంట్లు కూడా బారోవర్లను బెదిరించడం వంటివి చేయకూడదు. బారోవర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కొన్ని గైడ్లైన్స్ను ఆర్బీఐ తీసుకొచ్చింది. ‘ లోన్లు తిరిగి చెల్లించాలని బారోవర్లను లెండర్లు ఇబ్బంది పెట్టకూడదు. వేళకాని వేళలలో వాళ్ల ఇంటి కొచ్చి అప్పులు కట్టమని వేధించకూడదు. వారిని కొట్టడం వంటివి చేయకూడదు. లోన్ మంజూరు చేసే టైమ్లో చేసుకున్న అగ్రిమెంట్స్ ప్రకారమే లెండర్లు నడుచుకోవాల్సి ఉంటుంది. బారోవర్ల విషయాల్లో తలదూర్చకూడదు’ అని సార్థక్ అడ్వకేట్స్ పార్టనర్ మని గుప్తా అన్నారు. ఆర్బీఐ గైడ్లైన్స్ను లెండర్లు ఫాలోకాకపోతే బారోవర్లు లేదా వారి ఫ్యామిలీ ఈ విషయంపై బ్యాంకింగ్ అంబుడ్స్మన్ ఆఫీస్లో ఫిర్యాదు చేయొచ్చని సలహాయిచ్చారు.