
హాంకాంగ్: నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని చైనాకు అప్పగించేందుకు సంబంధించిన కాంట్రవర్షియల్ బిల్లుపై హాంకాంగ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆదివారం రికార్డు స్థాయిలో పది లక్షల మంది నిరసనకు దిగారు. 1997లో హాంకాంగ్ను బ్రిటన్ చైనాకు అప్పగించిన తర్వాత చేపట్టిన మిలియన్ మార్చ్ చేపట్టారు. ఇప్పుడు దానికి మించి ప్రజలు ఈ మార్చ్లో పాల్గొన్నారు. ఈ బిల్లుతో హాంకాంగ్ స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని, వెంటనే దానిని విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఆందోళన చెలరేగుతున్నా.. ప్రో-బీజింగ్ లీడర్లు మాత్రం బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. హాంకాంగ్లోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా కట్టడి చేసేందుకే ఈ బిల్లును తెస్తున్నామంటున్నారు. ఈ బిల్లును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, దీనిపై బుధవారం పార్లమెంట్లో యథావిధిగా చర్చ కొనసాగుతుందని హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ సోమవారం స్పష్టం చేశారు. లామ్ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం పార్లమెంట్ దగ్గర ర్యాలీకి, ఆందోళనలకు పిలుపునిచ్చాయి.