- పెద్ద మనసు చాటుకున్న బెంగాల్ క్యాబ్ డ్రైవర్
కోల్కతా: మహ్మద్ సైదుల్ లష్కర్.. బెంగాల్కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన చెల్లి కోసం.. నాలుగు ట్యాక్సీలు, భార్య బంగారు నగలు అమ్మి ఓ హాస్పిటల్ కట్టించాడు. ఇప్పుడు కరోనాతో బెంగాల్ అల్లాడుతుండటంతో 50 పడకల ఆ ఆస్పత్రిని క్వారంటైన్ సెంటర్గా మార్చేందుకు ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.
సొంత స్థలంలో.. క్యాబ్లను అమ్మి హాస్పిటల్నిర్మాణం
2004లో లష్కర్ చెల్లెలు మరుఫా న్యుమోనియాతో చనియింది. దీంతో ఆమె లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతో తన నాలుగు ట్యాక్సీలు, భార్య నగలు అమ్మి.. తాను ఎప్పుడో కొన్న స్థలంలో 50 పడకల హాస్పటల్ కట్టాడు. బరువిపూర్ జిల్లా పున్రి గ్రామంలో ఈ హాస్పిటల్ నిర్మించాడు. రోజు ఇక్కడ 300 మంది వరకూ పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ‘‘నా చెల్లెలికి గుర్తుగా నేను ఎప్పుడో కొన్న స్థలంలో ఈ హాస్పిటల్ కట్టా. ఇందుకోసం నా భార్యా, నేను తిండి కూడా తినకుండా డబ్బులు కూడబెట్టాం. ప్రతి ఇటుకను దగ్గరుండి మరీ మేమే కట్టించాం. కానీ కరోనా పై పోరాటం కోసం ఏమైనా చేయాలని భావించాను. అందుకే ప్రభుత్వానికి అవసరమైతే క్వారంటైన్ సెంటర్గా మార్చేందుకు మా హాస్పిటల్ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం”అని లష్కర్ చెప్పాడు.
హాస్పిటల్ ఎంప్లాయిస్కు కరోనాపై ట్రైనింగ్
ఇప్పటికీ ఆ ఆస్పత్రికి అవసరమైన లేటెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ కోసం నిధులు సమీకరించేందుకు లష్కర్ ప్రయత్నిస్తున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో తన ప్రయత్నాలను తాత్కాలికంగా వాయిదా వేశాడు. “నా భార్య, స్నేహితులు, బంధువులతో చర్చించిన తర్వాత నా హాస్పిటల్ను క్వారంటైన్ సెంటర్గా మార్చాలని జిల్లా అధికారులను కలిశాను. ఈ ప్రతిపాదనను హెల్త్ డిపార్ట్మెంట్కు, సీఎంవోకు పంపుతామని వారు చెప్పారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది” అని తెలిపాడు. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ రిలీఫ్ ఫండ్కు రూ.5 వేలు విరాళం ఇచ్చిన లష్కర్.. తన హాస్పిటల్లోని పది మంది పారామెడిక్ ఎంప్లాయిస్కు కరోనా కేసులను హ్యాండిల్ చేయడంపై ట్రైనింగ్ ఇస్తామని చెప్పాడు.