వరలక్ష్మీ వ్రతం నైవేద్యం : కొబ్బరి బొబ్బట్లు

వరలక్ష్మీ వ్రతం నైవేద్యం : కొబ్బరి బొబ్బట్లు

శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి శుక్రవారం తలంటు స్నానాలు, కొత్త బట్టలు, పూజలు, ప్రసాదాలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు చేసే వరలక్ష్మీ వ్రతం రోజున అయితే ఇంట్లో ఆడవాళ్లు చేసే హడావిడి చెప్పక్కర్లేదు. పొద్దున్నే మహాలక్ష్మీలా తయారై పండుగ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేస్తారు. అందులో భాగంగా లక్ష్మీదేవికి ఎంతో రుచికరమైన నైవేద్యాలు వండి పెడతారు. నిజానికి పండుగ రోజు నైవేద్యాలు అన్న పేరే గానీ, ఇంత రుచికరమైన ఫుడ్​ని ఎప్పుడు చేసినా కాదంటారా! మరింకెందుకాలస్యం ఈసారి వ్రతానికి వీటిని తప్పకుండా ట్రై చేయండి. వాటిని ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది. కచ్చితంగా తినాలనిపిస్తుంది. 

కావాల్సినవి :

మైదా, బెల్లం – ఒక్కో కప్పు చొప్పున

నీళ్లు, ఉప్పు – సరిపడా

నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు

కొబ్బరికాయ – ఒకటి

యాలకుల పొడి – అర టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో మైదా, ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి ముద్ద చేయాలి. అందులో కాగబెట్టి, చల్లార్చిన నెయ్యి వేయాలి. మరోసారి పిండిని కలిపి, గిన్నెపై మూతపెట్టి రెండు గంటలు పక్కన ఉంచాలి.  కొబ్బరికాయలోని కొబ్బరి తీసి పైన ఉండే ఉన్న చెక్కు తీయాలి. పచ్చి కొబ్బరి ముక్కల్ని తరిగి మిక్సీ జార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​లో నెయ్యి వేడి చేసి పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగించాలి. తర్వాత అందులో బెల్లం వేసి గరిటెతో తిప్పుతూ కరగబెట్టాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలపొచ్చు. యాలకుల పొడి కూడా వేసి కలపాలి. నానబెట్టిన మైదా పిండి ముద్దను మరోసారి కలిపి ఉండలు చేయాలి. ఒక ప్లాస్టిక్​ కవర్ మీద నెయ్యి రాసి దానిమీద మైదా ఉండల్ని పెట్టి చేత్తో అదమాలి. కొబ్బరి మిశ్రమాన్ని లడ్డూలా చేసి మధ్యలో పెట్టాలి. తర్వాత పిండితో నాలుగు వైపులా మూసేయాలి. దానిపై మరో కవర్​ పెట్టి చేత్తో అదమాలి. పాన్​ వేడయ్యాక నెయ్యి వేడి చేయాలి. బొబ్బట్లు వేసి రెండు వైపులా కాల్చాలి.