అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పర్యటన.. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందని ‘హౌడీ–మోడీ’ టీమ్ కామెంట్ చేసింది. ట్రంప్ తొలిసారిగా సోమవారం మనదేశంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో స్పందించింది. బైలేటరల్, స్ట్రాటజిక్ సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు, ఇండో–పసిఫిక్ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ను బలోపేతం చేసుకునేందుకు ట్రంప్ పర్యటన అవకాశం కల్పిస్తుందని అభిప్రాయపడింది. గతేడాది సెప్టెంబర్లో హ్యూస్టన్లో చారిత్రాత్మక ‘హౌడీ-మోడీ’ ప్రోగ్రామ్ నిర్వహించారు. అహ్మదాబాద్లో అలాంటి కార్యక్రమాన్నే ‘నమస్తే ట్రంప్’ పేరుతో జరుపుతున్నారు. ఈ ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ట్రంప్ పాల్గొననున్నారు. ‘‘ఫిబ్రవరి 24న జరిగే సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ ఆర్గనైజర్లు కష్టపడుతున్నారు. వారి శ్రమకు కొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయి. రిజల్ట్స్ను చూడాలని మేం ఎదురుచూస్తున్నాం” అని హౌడీ–మోడీ కన్వీనర్ జుగల్ మలాని ఓ ప్రకటనలో చెప్పారు. 145 బిలియన్ డాలర్ల బైలేటరల్ ట్రేడ్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు హౌడీ–మోడీ, నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్స్ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రెండు దేశాలకు కావాల్సింది కూడా ఇదేనని అభిప్రాయపడ్డారు.
మత స్వేచ్ఛపై చర్చ!?
ప్రధాని మోడీతో జరిగే చర్చల సందర్భంగా రిలీజియస్ ఫ్రీడమ్ అంశాన్ని ట్రంప్ లేవనెత్తుతారని వైట్ హౌజ్ ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సంస్థలపై అమెరికాకు ఎంతో గౌరవం ఉందని, ఇండియా పాటించే విలువలను నిలబెట్టే విషయంలో తమ ప్రోత్సాహం కొనసాగుతుందని చెప్పింది. ట్రంప్ పర్యటన నేపథ్యంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ ‘ఫాక్ట్స్షీట్’ పేరుతో ఓ రిపోర్టు పబ్లిష్ చేసింది. ఇండియాలో మత స్వేచ్ఛ డౌన్ టర్న్ తీసుకుందని ఆరోపించింది.
కేజ్రీవాల్ను పిలవలే!
మన దేశ టూర్లో భాగంగా అమెరికా ఫస్ట్లేడీ మెలానియా ట్రంప్… ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్కు వెళ్తారు. అయితే ఆమె టూర్ విషయంలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఆహ్వానం అందలేదని ఆప్ వర్గాలు చెప్పాయి. మెలానియాతోపాటు కేజ్రీవాల్, సిసోడియా ఈనెల 25న సౌత్ ఢిల్లీలోని ఓ స్కూల్కు వెళ్తారని అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. అక్కడ మెలానియాకు ‘హ్యాపీనెస్’ క్లాస్ల గురించి కేజ్రీవాల్, సిసోడియా చెబుతారని వార్తలొచ్చాయి. కానీ తమకు ఎలాంటి ఇన్విటేషన్ రాలేదని ఆప్ వర్గాలు చెప్పాయి. ఢిల్లీ, కేంద్ర సర్కార్లు దీనిపై అధికారికంగా రియాక్ట్ కాలేదు. అయితే రాజకీయాలను పక్కనపెట్టి అన్ని పార్టీలు మనదేశానికి వస్తున్న గెస్ట్ను ఇన్వైట్చేయడంపై దృష్టిపెట్టాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా సూచించారు.
అహ్మదాబాద్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్ లో ట్రంప్ కమిటీ శనివారం సమావేశమైంది. ఈ 24 న జరగనున్న కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను ఈ కమిటీ చర్చించింది. అహ్మదాబాద్ లో ట్రంప్ దంపతులు ఈ నెల 24 న పర్యటించనున్నారు. భారీ ర్యాలీతో పాటు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు…అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకునేందుకు 10 మంది సభ్యులతో ప్రభుత్వం ట్రంప్ కమిటీని ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్ మేయర్ ఛైర్మన్ గా ఉన్న కమిటీలో అహ్మబాదాబాద్ ఈస్ట్, వెస్ట్ ఎంపీలతో పాటు 10 మంది ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ట్రంప్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కమిటీ పర్యవేక్షిస్తోంది. సమావేశంలో ట్రంప్ దంపతులకు ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించారు. “మా ప్రాంతానికి వచ్చిన అతిథులకు ఘనంగా స్వాగతం పలకటం మా సంస్కృతి అని ట్రంప్ దంపతులు అబ్బురపడేలా వారిని అహ్మదాబాద్ కు ఆహ్వానిస్తాం ” అని మేయర్ పాటిల్ తెలిపారు.
అహ్మదాబాద్ చేరుకున్న నాలుగో కార్గో ఫ్లయిట్
సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్, ట్రంప్ కాన్వాయ్లోని వెహికిల్స్తో నాలుగో కార్గో ప్లేన్ శనివారం అహ్మదాబాద్కు చేరుకుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే మూడు కార్గో ప్లేన్లు ల్యాండ్ అయ్యాయని అన్నారు. ఇంతకు ముందు వచ్చిన మూడు కార్గో ఫ్లయిట్లలో కూడా ట్రంప్ సెక్యూరిటీకి చెందిన ఎక్విప్మెంట్ వచ్చింది. వాటిలో ఒకదాంట్లో ‘మెరైన్ వన్’ హెలికాప్టర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
‘ప్యాసింజర్లు 3 గంటల ముందే రండి’
ట్రంప్ టూర్ నేపథ్యంలో ప్యాసింజర్లకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు అడ్వైజరీ పాస్ చేశారు. ఈ నెల 24న ప్రయాణం చేసే వారు మూడు గంటల ముందే ఎయిర్పోర్ట్కు చేరుకోవాలని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మనోజ్ గంగాలా చెప్పారు. ఆ రోజు ఫ్లయిట్లన్నీ యథావిధిగా నడుస్తాయని అన్నారు.