- భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య గంటన్నర పాటు భీకర పోరు
- మృతుల్లో ముగ్గురు తెలంగాణ వాళ్లు
- కమాండర్ శంకర్ రావు, లలిత, సుజాతగా గుర్తింపు!
- బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ నెల 19న తొలి విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. బస్తర్ సెగ్మెంట్కు అదే రోజు ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీంతో దాడులకు దిగుతుందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అలర్ట్అయ్యాయి. కాంకేర్ జిల్లాలోని అడవుల్లో బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంగళవారం భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. వెంటనే తేరుకున్న బలగాలు ప్రతిదాడికి దిగాయి. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు భీకరమైన కాల్పులు జరిగాయి.
కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో 29 మంది మావోయిస్టుల డెడ్బాడీలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో తెలంగాణ క్యాడర్కు చెందిన కమాండర్ శంకర్రావు, లలిత, సుజాత ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. వీరిలో శంకర్రావుది నల్గొండ జిల్లా. ఎన్ కౌంటర్ లో బీఎస్ఎఫ్ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనా స్థలంలో ఐదు ఏకే 47, 303 రైఫిల్స్, ఇన్సాస్లు, రాకెట్లాంఛర్లు స్వాధీనం చేసుకున్నారు. మందుపాతరలు, నిత్యావసర సామగ్రి, విప్లవ సాహిత్యం దొరికాయి. కూంబింగ్కు వెళ్లిన బలగాల కోసం బ్యాకప్టీమ్స్ పంపించామని, వాళ్లు తిరిగొచ్చాక పూర్తి వివరాలు అందిస్తామని బస్తర్ఐజీ సుందర్ రాజ్, కాంకేర్ఎస్పీ ఇంద్రకల్యాణ్ తెలిపారు.
5 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ రెడ్అలర్ట్ ప్రకటించింది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఆంధ్రా, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో ఐదు రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు భద్రాచలంలో మకాం వేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ..
ఇటీవల కాలంలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. చత్తీస్గఢ్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక బేస్క్యాంపు ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ.. మావోయిస్టులను ఏరివేసేందుకు స్పెషల్ ఆపరేషన్లు చేపడుతున్నది. మావోయిస్టు పార్టీ మాస్టర్మైండ్హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కూడా ఇటీవల క్యాంపు ఏర్పాటు చేసింది. అక్కడ ఎయిర్స్ట్రైక్స్ నిర్వహిస్తున్నది. మార్చి, ఏప్రిల్లో జరిగిన ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. కాగా, ఈ మధ్య కాలంలో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్గా చెప్పొచ్చు.
గతంలో జరిగిన కొన్ని పెద్ద ఎన్కౌంటర్ల వివరాలివీ..
2008 మార్చి 18న చత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా కంచాలలో జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు చనిపోయారు.
2011 జూన్ 26న చత్తీస్ గఢ్ లోని కాంకేర్జిల్లా కోయిలీబేడా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు.
-2011 నవంబర్ 24న కేంద్ర కమిటీ సభ్యుడు కిషన్జీతో పాటు ఆరుగురు నక్సలైట్లను చత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్కౌంటర్ చేశారు.
2012 మార్చి 14న డేడాయ్అడవుల్లో మావోయిస్టు పార్టీ ప్లీనరీపై బలగాలు మెరుపుదాడి చేయగా15 మంది చనిపోయారు.
2012 జూన్ 28, 29న సార్కెగూడ, కొట్టగూడ, రాజుపెంట గ్రామాల సమీపంలోని ఘనీ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో 17 మంది చనిపోయారు.
2013 ఏప్రిల్ 16న బీజాపూర్ జిల్లా పువ్వర్తిలో తెలంగాణకు చెందిన కేకేడబ్ల్యూ దళం సభ్యులు 9 మంది మృతి చెందారు.
2018 ఏప్రిల్ 22, 23 తేదీల్లో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ లో 42 మంది చనిపోయారు.
2018లోనే చత్తీస్గఢ్ బీజాపూర్జిల్లా ఇర్మెట్టలో జరిగిన ఎన్కౌంటర్ లో 10 మంది మృతి చెందారు.