బుర్ఖాలో వచ్చి రూ. 20 లక్షలు ఎత్తుకెళ్లిండు .. డబ్బులు దొంగిలించి పరారైన డ్రైవర్ అరెస్ట్

బుర్ఖాలో వచ్చి రూ. 20 లక్షలు ఎత్తుకెళ్లిండు .. డబ్బులు దొంగిలించి పరారైన డ్రైవర్ అరెస్ట్

 మెహిదీపట్నం, వెలుగు:  పని చేసిన ఇంట్లోనే రూ. 19 లక్షలు ఎత్తుకెళ్లిన మాజీ డ్రైవర్​ను హుమాయూన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మధ్యాహ్నం సౌత్ వెస్ట్ జోన్ ఆఫీసులో ఇన్ చార్జ్  డీసీపీ సాయి చైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు. విజయ్ నగర్ కాలనీకి చెందిన డాక్టర్ షబ్బీర్ సంగారెడ్డి ప్రభుత్వ కాలేజీలో హెచ్​వోడీ. ఆయన వద్ద కొన్నేళ్లుగా సంతోష్​నగర్​కు చెందిన మహమ్మద్ ఇసాక్ (27), డ్రైవర్​గా ఉన్నాడు.

 గతేడాది ఇసాక్ పని మానేశాడు. అయితే.. షబ్బీర్ ఇంట్లో బెడ్రూమ్​లో డబ్బులు ఎక్కడ దాచిపెడ్తాడో ఇసాక్​కు తెలుసు. ఇటీవల ప్లాట్ రిజిస్ట్రేషన్​కు షబ్బీర్ తెచ్చిన రూ. 20 లక్షలు బెడ్రూంలో దాచి పెట్టాడు. ఈనెల 4న డబ్బులు కనిపించకపోవడంతో హుమాయూన్​నగర్ పీఎస్​లో కంప్లయింట్ చేశాడు.  డీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా  ఇసాక్..  బుర్ఖా వేసుకుని వచ్చి షబ్బీర్ ఇంట్లోని రూ. 20 లక్షల ఎత్తుకెళ్లినట్టు  పోలీసులు గుర్తించారు.

 నిందితుడు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కు వెళ్లి బస్సులో  కర్నూలుకు వెళ్లాడు. కొన్ని రోజులు అక్కడే ఉండి తిరిగి సంతోష్​నగర్​కు తిరిగొచ్చాడు. పోలీసులు నిఘా పెట్టి ఇసాక్​ను పట్టుకొని విచారించగా చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. అతని వద్ద రూ. 14 లక్షల 19 వేలను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి గురువారం రిమాండ్​కు తరలించినట్లు ఇన్​చార్జ్ డీసీపీ తెలిపారు. ఏసీపీ రాజవెంకట్ రెడ్డి ఆధ్వర్యంలోని సీఐ సైదేశ్వర్ టీమ్ , హుమాయూన్ నగర్ డీఐ బాలకృష్ణ , క్రైం సిబ్బందిని  అభినందించారు.