నందిగామ: తినే భోజనంలో మత్తు పదార్ధాలు కలిపి పెడుతుందన్న అనుమానంతో ఓ వ్యక్తి తన భార్య గొంతు నులిమి చంపేశాడు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
గ్రామానికి చెందిన రాచబండ ప్రసాద్, పద్మ లకు 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. గత నాలుగు రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండటం తో ప్రసాద్ కుటుంబసభ్యులు భార్యాభర్తలిద్దర్నీ కూర్చోబెట్టి సర్ది చెప్పారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని, గొడవ పడకూడదని సూచించి వెళ్లారు.
కాగా ఆదివారం రాత్రి కూడా ఎప్పటిలాగే వారిద్దరు గొడవపడ్డారు. ఆ గొడవ తారస్థాయికి చేరడంతో ప్రసాద్.. తన భార్యను గొంతు నులిమి , అనంతరం గోడకేసి కొట్టి హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చందర్లపాడు పోలీసులు.. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.