హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ వాళ్లు సోషల్ మీడియాలో తనను ఇష్టమొచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారని, అలాంటి వాళ్ల తోలు తీస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. వంగర గురుకుల స్కూల్లో ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోతే.. ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆయన విమర్శించారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయకపోతే ఆందోళనలు చేస్తామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు.
చనిపోయిన విద్యార్థిని స్కూల్లో టాపర్ అని, ఆ అమ్మాయిని స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ప్రిన్సిపాల్ వేధించారని ఆరోపించారు. స్కూల్ లోని సరుకులను ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ తీసుకువెళ్తుంటే ఆ అమ్మాయి చూసిందని, దీంతో ఆమెను వాళ్లు తీవ్రంగా వేధించారని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ పరిధిలో గురుకుల విద్యార్థిని చనిపోతే కనీసం అక్కడకు వెళ్లలేదని విమర్శించారు.
