స్పోర్ట్స్ హబ్గా హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

స్పోర్ట్స్ హబ్గా హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఫుట్ బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ 2023 ను గ్లోబుల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదులో నిర్వహించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ స్కేటింగ్ ముందుకు వచ్చిందనీ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఫుట్ బాల్ స్కేటింగ్ నిర్వాహణకు అవసరమైన పూర్తి సహకారం తెలంగాణ ప్రభుత్వం క్రీడా శాఖ తరఫున అందిస్తామన్నారు మంత్రి.

హైదరాబాద్ సిటీ అనేక క్రీడా అంశాలలో స్పోర్ట్స్ హబ్ గా రూపాంతరం చెందుతుందన్నారు. మే 2వ తేదీ మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన క్యాంపు కార్యాలయంలో 15వ ఫుట్ బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ -2023ను నగరంలో నిర్వహించేందుకు ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు టర్కీ కి చెందిన మెగ్ది సల్మాన్ పౌర్, సహా అధ్యక్షురాలు జహ్రా అబ్దోలిహారందిలను కలిసి చర్చించారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించామన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్టేడియాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే సగానికి పైగా క్రీడా మైదానాలను నిర్మించమన్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం దేశంలో కొత్తగా ఏర్పాటునప్పటికీ ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించడంలో దేశంలోనూ రెండో స్థానం సాధించారన్నారు శ్రీనివాస్ గౌడ్. బాక్సింగ్ క్రీడాకారిని నిక్కత్ జరీన్, షూటింగ్ క్రీడాకారిణి ఇషా సింగ్ లు వరల్డ్ ఛాంపియన్షిప్ లు సాధించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2శాతం, ఉన్నత విద్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.