
- అర్బన్ మార్కెట్, ఆన్లైన్ గ్రాసరీ పేరిట ట్రాప్
- ఫ్రూట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని హవాలా దందా
- ఇద్దరు పార్ట్నర్ల మధ్య గొడవ రావడతో పరస్పరం కేసులు
- ఫిర్యాదుదారులనే నిందితులుగా గుర్తించిన సీసీఎస్ పోలీసులు
- హవాలా గుట్టు విప్పేందుకు రంగంలోకి దిగిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: అర్బన్ మార్కెట్, ఆన్ లైన్ గ్రాసరీల పేరుతో మార్కెట్ డీల్ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టించిన కొందరు వ్యక్తులు ఇన్వెస్టర్లకు రూ. 75 కోట్లు టోకరా వేశారు. హవాలా దందా కూడా సాగిన ఈ వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పెద్ద మొత్తంలో హవాలా రూపంలో లావాదేవీలు సాగిన నేపథ్యంలో దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
అయితే, డాక్టర్లు, పలు డిపార్ట్మెంట్లకు చెందిన ప్రముఖులు కూడా పెట్టుబడులు పెట్టిన ఈ కేసులో ఫిర్యాదుదారుడినే పోలీసులు నిందితుడిగా తేల్చారు. ప్రధాన నిందితుడు మఖేష్ చౌదరి సహా ఫిర్యాదుదారుడైన అమిత్ కుమార్ పిలానియాను ఇటీవల సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు ఇద్దరు కలిసి బాధితులను దాదాపు రూ.75 కోట్ల మేరకు మోసం చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇందులో రూ.24.35 కోట్లకు సంబంధించి బాధితులను గుర్తించారు. ఫ్రూట్ సప్లయింగ్ పేరుతో హవాలా దందా చేసినట్లు ఆధారాలు సేకరించారు.
ఫిర్యాదుదారులే నిందితులు..
మహారాష్ట్రకు చెందిన అమిత్కుమార్ పిలానియా(31) మలక్పేట్ ప్రొఫెసర్స్ కాలనీలో పిలానియా రోడ్ క్యారియర్స్ పేరుతో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ కొత్తపేట ఆనంద్నగర్లో నివాసం ఉంటున్న రాజస్థాన్కు చెందిన ముఖేశ్ కుమార్ చౌదరీ(33)తో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. బిజినెస్లో భాగంగా పలుమార్లు ముఖేశ్ తన వద్ద దాదాపు రూ.24 లక్షల వరకు తీసుకుని మోసం చేసినట్లు అమిత్ కుమార్ గతేడాది మార్చిలో మలక్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారం పేరుతో చాలా మందిని దాదాపు రూ.50 కోట్ల వరకు మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మలక్పేట్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా సిటీ సీసీఎస్ పోలీసులు గతేడాది ఏప్రిల్ 27న మరో కేసు రిజిస్టర్ చేశారు.
అమిత్ కుమార్ ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ముఖేశ్ చౌదరి, అమిత్ కుమార్ కలిసి వ్యాపారాలు చేసినట్లు గుర్తించారు. ఇద్దరూ నిందితులే అని తేల్చారు. ఇద్దరి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాల కారణంగానే కేసులు పెట్టుకున్నట్లు గుర్తించారు. మోసాల గుట్టు విప్పేందుకు సీసీఎస్ పోలీసులు చార్టెడ్ అకౌంటెంట్ల సహకారం తీసుకున్నారు. బాధితులు పెట్టుబడిగా పెట్టిన డబ్బుతో పాటు వీరిద్దరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు గుర్తించారు. కేసు తీవ్రత నేపథ్యంలో ఒక ఐపీఎస్ అధికారి నుంచి కూడా ఒత్తిళ్లు కూడా ఎదుర్కొన్నట్లు తెలిసింది.
రూ.75 కోట్లు గోల్మాల్..
ముఖేశ్ కుమార్, అమిత్ కుమార్ కలిసి అర్బన్ మార్కెట్ పేరుతో ఆన్లైన్ గ్రాసరీ యాప్ తయారు చేశారు. ‘డీల్’ పేరుతో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లు సేకరించారు. ఫ్రూట్స్ బిజినెస్లో అధిక లాభాలు ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. సరూర్నగర్ కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ సమీపంలో ఆఫీసులు ఏర్పాటు చేశారు. ముఖేశ్ గత 20 ఏండ్లకు పైగా హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తుండడంతో చాలా మంది ప్రముఖులు, డాక్టర్లు, ఐపీఎస్ అధికారుల కుటుంబాలతో పరిచయాలు ఉన్నాయి. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన వారు కూడా ముఖేశ్, అమిత్ నిర్వహించే అర్బన్ మార్కెట్ డీల్స్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒక్కొక్కరు సగటున రూ.5 లక్షలు మొదట రూ.2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. ఇలా దాదాపు రూ.75 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు. అయితే ముఖేశ్, అమిత్ మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలే గుట్టును రట్టు చేశాయి.