హైదరాబాద్ కలెక్టరేట్ లక్డీకపూల్​కి షిఫ్ట్

హైదరాబాద్ కలెక్టరేట్ లక్డీకపూల్​కి షిఫ్ట్

అబిడ్స్​లోని బిల్డింగ్ పోలీస్ శాఖకు అప్పగింత
త్వరలో అక్కడ సౌత్ వెస్ట్ డీసీపీ ఆఫీస్ ​ఏర్పాటు
1948 నుంచి అబిడ్స్​లో కొనసాగిన హైదరాబాద్​ కలెక్టరేట్
ఇక రంగారెడ్డి జిల్లా పాత కలెక్టరేట్ బిల్డింగ్ నుంచి సేవలు

హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అబిడ్స్​లో కొనసాగుతున్న హైదరాబాద్ ​జిల్లా కలెక్టరేట్ లక్డీకపూల్ లోని పాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​బిల్డింగ్​లోకి షిఫ్ట్​ అయింది. ఇక నుంచి ఏ పనులు కావాలన్నా లక్డీకపూల్ వెళ్లాల్సిందే. 1948 నుంచి అబిడ్స్ లో హైదరాబాద్ కలెక్టరేట్ కొనసాగుతూ వచ్చింది. కలెక్టరేట్ బిల్డింగ్​పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో 1990లో అక్కడే నాలుగు అంతస్తులతో కొత్త బిల్డింగ్ ​నిర్మించారు. కలెక్టర్ చాంబర్​తోపాటు కొన్ని విభాగాలను కొత్త బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేశారు. స్పేస్​సరిపోక చాలా శాఖల ఆఫీసులు వేర్వేరుగా దూరంగానే ఉంటున్నాయి. మొత్తం 32 విభాగాలను నిర్వహించడానికి స్థలం లేకపోవడంతో 17 ఏండ్ల కిందట మాసాబ్‌‌ ట్యాంక్‌‌ వద్ద ఎకరం ప్రభుత్వ స్థలంలో కొత్త కలెక్టరేట్‌‌కాంప్లెక్స్‌‌ నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ నిర్మాణం జరగలేదు. కొంతకాలంగా కలెక్టరేట్​బిల్డింగ్ సరిపోకపోవడంతోపాటు పాత బిల్డింగ్​శిథిలావస్థకు చేరింది.ఈ క్రమంలో లక్డీకాపూల్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కొంగర కలాన్ కి మారడంతో అక్కడ బిల్డింగ్ ఖాళీ అయింది. దీంతో హైదరాబాద్ కలెక్టరేట్ ను లక్డీకపూల్​కి షిఫ్ట్ చేశారు. సిటీ సెంటర్ లో ఉండటంతోపాటు, బిల్డింగ్​అన్ని శాఖలకు సరిపోతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. 

రెండింటిలో ఒకటి ఇక్కడ

పోలీస్​శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ వెస్ట్ జోన్​డీసీపీ ఆఫీసుకు అబిడ్స్ బిల్డింగ్ ను కేటాయించారు. మొన్నటిదాకా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్త్, ఈస్ట్,  వెస్ట్, సౌత్, సెంట్రల్ జోన్ లు ఉండేవి. తాజాగా సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పేర్లతో రెండు కొత్త జోన్లను పోలీస్​శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో సౌత్ ఈస్ట్ డీసీపీ ఆఫీసును సైదాబాద్​లో ఏర్పాటు చేయగా, సౌత్ వెస్ట్ డీసీపీ ఆఫీసును అబిడ్స్​లోని కలెక్టరేట్​ బిల్డింగ్​లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ సౌకర్యం, సరిపడా గదులు ఉన్నాయి. కానీ బిల్డింగ్​మాత్రం చాలా పాతది.

డీఎంహెచ్ఓ, డీఈఓ ఆఫీసులు మినహా

హైదరాబాద్ కలెక్టరేట్ లో మొత్తం 32 విభాగాలు ఉన్నాయి. ఇందులో రెండు మినహా మిగిలిన 30 విభాగాలు లక్డీకపూల్ బిల్డింగ్ కు షిఫ్ట్ అయ్యాయి. డీఎంహెచ్ఓ, డీఈఓ ఆఫీసులకు ఎక్కువ స్పేస్ అవసరం ఉండటంతో వాటిని ప్రస్తుతం ఉన్నచోటే కొనసాగిస్తున్నారు. హైదరాబాద్​డీఈఓ ఆఫీస్ మహబూబియా కాలేజీలో, డీఎంహెచ్ఓ ఆఫీస్ సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

కొత్త బిల్డింగ్ నిర్మాణం లేనట్టేనా?

హైదరాబాద్ కలెక్టరేట్ కొత్త కాంప్లెక్స్‌‌ కోసం 2007, ఏప్రిల్ లో రూ.10 కోట్లు మంజూరు అయ్యాయి. ఆర్‌‌ అండ్‌‌ బీ శాఖ,  ప్రైవేట్‌‌ కన్సల్టెంట్​కంపెనీతో కలిసి 10 అంతస్తుల్లో నిర్మించాలని అప్పట్లో డిజైన్​కూడా చేసింది. కాంప్లెక్స్‌‌ అంచనా వ్యయం రూ.46 కోట్లు కాగా, ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏ మూలకు సరిపోక పనులు మొదలు పెట్టలేదు. 2008 మార్చిలో బడ్జెట్‌‌ గడువు ముగియడంతో కలెక్టరేట్​కాంప్లెక్స్​ నిర్మాణ ప్రతిపాదన పెండింగ్‌‌లో పడింది. ఆ తర్వాత హైదరాబాద్​జిల్లా కలెక్టర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌‌ మిట్టల్‌‌ మరో ఆర్కిటెక్ట్‌‌ ద్వారా ప్లాన్​ను ఆరు అంతస్తులకు తగ్గించి రూ.22 కోట్ల అంచనాతో లక్షా80 వేల చదరపు అడుగుల ఏరియాలో బిల్డింగ్ నిర్మించేలా డిజైన్‌‌ చేయించారు. మార్పులు, చేర్పులతో ప్రపోజల్స్ ను ప్రభుత్వ ఆమోదానికి పంపగా, కలెక్టరేట్‌‌ కాంప్లెక్స్‌‌ భూ వేలంతో వచ్చిన మొత్తాన్ని కొత్త కాంప్లెక్స్‌‌ నిర్మాణానికి ఉపయోగించాలని సూచించింది. దీంతో నిర్మాణం పెండింగ్‌‌లో పడింది. ప్రస్తుతం అబిడ్స్ నుంచి కలెక్టరేట్​ను లక్డీకపూల్​కి మార్చడంతో ఇక కొత్త బిల్డింగ్ నిర్మాణం లేనట్టుగా తెలుస్తోంది.