
- కిలోమీటర్స్ స్లాబ్స్ మార్చి ధరలు పెంచిన మెట్రో అధికారులు
- లాంగ్ డిస్టెన్స్ ప్రయాణికులే టార్గెట్
- ఇప్పటికే పార్కింగ్, టాయిలెట్స్ చార్జీలతో సతమతం
‘‘నగర శివారు బీఎన్ రెడ్డి నగర్ లో ఉండే దామోదర్ ఎస్ఆర్ నగర్ లో లెక్చరర్.. ప్రతిరోజూ ఆయన ఇంటి నుంచి ఎల్బీనగర్ కు బైక్ పై వచ్చి వాహనాన్ని పార్క్చేసి మెట్రోలో అమీర్పేట్కు వెళ్తుంటాడు. మెట్రోలో వెళ్లేందుకు రూ.45, వచ్చేందుకు రూ.45. రూ.90 చెల్లించేవాడు. బైక్ పార్కింగ్ కు రూ.30 కట్టేవాడు. మొత్తం రూ.120 అయ్యేది. ప్రస్తుతం టికెట్స్ కు రూ.120, పార్కింగ్ కు రూ.30 కలిపి రూ.150 చెల్లిస్తున్నాడు. తనకు వచ్చే రూ.20 వేల వేతనంలో బైక్ పార్కింగ్ కు, మెట్రో టికెట్లకే 20 శాతం పోతోందని ఆవేదన చెందుతున్నాడు.’’
హైదరాబాద్, వెలుగు: మొన్నటిదాక మెట్రో జర్నీ చాలా చవక అని ప్రచారం చేసుకున్న అధికారులు ప్రయాణికులపై ధరల భారం మోపి శనివారం నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కనిష్టంగా రూ.2 ..గరిష్టంగా రూ.15 వరకు మాత్రమే పెంచామని ప్రకటనలు చేసినా ఒక్కొక్కరిపై భారీగానే భారం పడనున్నది. తెలివిగా కిలోమీటర్ల చొప్పున స్లాబులను మార్చి ట్రిప్పుపై రూ.15 పెంచడంతో సగటు సామాన్య ప్రయాణికుడిపై నెలకు ఏకంగా సుమారు రూ.వెయ్యి వరకు భారం పడుతోంది.
కిలో మీటర్ల మ్యాజిక్.. రూ.15 అదనం
మెట్రో అధికారులు.. కిలోమీటర్ల ఆధారంగా మ్యాజిక్ చేసి తమ జేబులను కొల్లగొడుతున్నారని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గతంలో రెండు కిలోమీటర్ల చొప్పున ఒక స్లాబ్ఉంటే దాన్ని 6 కిలోమీటర్ల తర్వాత మూడు కిలోమీటర్లకు పెంచారు. పాత స్లాబ్లో 10 నుంచి 14 కిలోమీటర్లు అంటే నాలుగు కిలోమీటర్లకు స్లాబ్ఉంటే దాన్ని మూడు కిలోమీటర్లకు కుదించారు. దీనివల్ల తక్కువ ప్రయాణించే వారు కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నది. గతంలో మెట్రోలో 8, 9, 10 కిలోమీటర్లకు రూ.35 ఉంటే దీన్ని 9,10, 11, 12 కిలోమీటర్లుగా మార్చి రూ.50 తీసుకుంటున్నారు. గతంలో 11, 12, 13, 14 కిలోమీటర్లకు రూ.40 ఉంటే దీన్ని ఇప్పుడు13,14, 15 కిలోమీటర్లుగా మార్చి రూ.55 వసూలు చేస్తున్నారు.
గతంలో 15, 16, 17,18 కిలోమీటర్లకు రూ.45 ఉంటే ఇప్పుడు16, 17, 18 కిలోమీటర్లు మార్చి రూ.60 తీసుకుంటున్నారు. గతంలో 19, 20, 21, 22 కిలోమీటర్లకు రూ.50 ఉంటే, తాజాగా 19, 20, 21 కిలోమీటర్లు చేసి రూ. 66 వసూలు చేస్తున్నారు. ఈ స్లాబ్లో ఏకంగా 16 పెంచారు. గతంలో 23, 24, 25, 26 కిలోమీటర్లకు రూ.55 ఉంటే ఇప్పుడు 22, 23, 24 కిలోమీటర్లకు రూ.70 చేశారు. దీంతో ఒక సాధారణ ఉద్యోగి ఆఫీసుకు అప్అండ్డౌన్చేస్తే ట్రిప్పుకు రూ.15 చొప్పున రోజుకు రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా నెలకు రూ. వెయ్యి వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది.
లాంగ్ డిస్టెన్స్ ప్రయాణికులే టార్గెట్
గతంలో మెట్రో కనిష్ట చార్జీ 2 కిలోమీటర్ల వరకు రూ.10 ఉండేది. అది ప్రస్తుతం రూ.12 చేశారు. 2 నుంచి 4 కిలోమీటర్ల దూరం జర్నీకి రూ.15 నుంచి రూ.18, 4 నుంచి 6 కిలోమీటర్లకు రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఇంతవరకు మాత్రం స్లాబులు మార్చకుండా స్వల్పంగానే పెంచినట్టు చూపించారు. అయితే, 6 కిలోమీటర్ల నుంచి స్లాబులను మార్చేసి ప్రయాణికులపై అధిక ధరల భారాన్ని మోపారు. గతంలో 6 నుంచి 8 కిలోమీటర్లకు రూ. 30 ఉండేది. ప్రస్తుత స్లాబులో కిలోమీటర్ల స్లాబును 6 నుంచి 9 కిలోమీటర్లకు మార్చి రూ. 40 చేశారు.
గత స్లాబుతో పోలిస్తే ఒక్క కిలోమీటర్పెంచి టికెట్ ధర ఏకంగా రూ.10 బాదారు. ఆ తర్వాత 9 నుంచి 12 కిలోమీటర్లు, 12 నుంచి 15 కిలోమీటర్లు,15 నుంచి 18 కిలోమీటర్ల వరకు ఒకటి, రెండు కిలోమీటర్లు తగ్గిస్తూ, పెంచుతూ గత చార్జీలతో పోల్చితే రూ.15 అధికంగా పెంచుతూ పోయారు. ఇలా 9 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారినే ఎక్కువగా టార్గెట్చేశారు. అలాగే ఉద్యోగులు ప్రయాణించే మెట్రోస్టేషన్లే లక్ష్యంగా ధరలు పెంచారని వాపోతున్నారు.
పెంచిన చార్జీలను తగ్గించాలి
మాది నాదర్ గుల్. నేను హైటెక్ సిటీలో జాబ్చేస్తా. ఇంటి నుంచి రోజు బైక్ పై ఇక్కడికి రావడానికి ఇబ్బంది అవుతోందని నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీకి మెట్రోలో వస్తున్నా. ఇప్పటివరకు రోజూ నాకు బైక్ పార్కింగ్, మెట్రో టికెట్ తో కలిపి రూ.135 ఖర్చు అయ్యేది. పెరిగిన చార్జీల కారణంగా శనివారం నుంచి కేవలం మెట్రో రైలుకే రూ.150 పెట్టాల్సి వస్తోంది. మళ్లీ అదనంగా పార్కింగ్ చార్జీలు కూడా. ఈ మెట్రో చార్జీలు సామాన్యులపై భారాన్ని మరింత పెంచాయి. ఎల్ అండ్ టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. – డాక్టర్ వెంకటేశ్, మెట్రో ప్రయాణికుడు
స్లాబులు గజిబిజి..
గతంలో కిలోమీటర్ల స్లాబుకు, స్లాబుకు మధ్య సగటున రూ.5 వ్యత్యాసం ఉండేది. 2 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే రూ.10, 4 కిలోమీటర్ల వరకు వెళ్తే రూ.15, 6 కిలోమీటర్ల వరకు రూ.25, 8 కిలోమీటర్ల వరకు రూ.30, తర్వాత ప్రతి 4 కిలోమీటర్లకు సగటున రూ. 5 పెంచుతూ రూ.60 వరకు స్లాబ్స్ ఉండేవి. స్లాబ్ కిలోమీటర్మారితే రూ.5 మాత్రమే అదనంగా చెల్లించాల్సి వచ్చేది.
కానీ, ప్రస్తుత స్లాబుల్లో మాత్రం ఒక కిలోమీటర్అటూ ఇటూ మార్చేసి, గత స్లాబుతో పోలిస్తే రూ.10, మరోచోట రూ.12, ఇంకోచోట రూ.16 ఇలా పెంచుకుంటూ పోయారు. గత స్లాబులో గరిష్టంగా 26 కిలోమీటర్ల వరకు రూ.60 చార్జీగా నిర్ణయించారు. ఆపైన ఎంత ప్రయాణించినా రూ.60 చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుత స్లాబ్ లో గరిష్టంగా కిలోమీటర్లను రూ.24కు కుదించారు. రెండు కిలోమీటర్లు తగ్గించడమే కాకుండా గరిష్ట చార్జీని రూ.60 నుంచి రూ.75కి పెంచడం గమనార్హం.