- అందుకే ఐపీఎల్లో పని చేస్తున్నా
- అందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు: గంభీర్
న్యూఢిల్లీ:క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఎంపీగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. అదే టైమ్లో క్రికెట్తో అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కామెంటేటర్గా, కోచ్గా (ఐపీఎల్లో) వ్యవహరిస్తున్నాడు. అయితే, ఎంపీ అయినప్పటికీ ఐపీఎల్లో పని చేస్తున్నందుకు తానేమీ సిగ్గుపడటం లేదని గౌతీ చెప్పాడు. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని పేద ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నానని వెల్లడించాడు. తాను ప్రతి నెల ఐదు వేల మందికి అన్నం పెడుతున్నానని తెలిపాడు. ఇందుకు నెలకు పాతిక లక్షలు ఖర్చవుతోందన్నాడు. ‘ఐదు వేల మందికి అన్నం పెట్టేందుకు ఏడాదికి రూ. 2.75 కోట్లు ఖర్చు చేస్తున్నా. ఈ మొత్తాన్ని నేను కష్టపడి సంపాదించిన దాన్నుంచే ఇస్తున్నా. అందుకే ఐపీఎల్ కామెంటరీ చేస్తున్నందుకు, లీగ్లో పని చేస్తున్నందుకు నేను సిగ్గు పడటం లేదు. ఇదంతా ప్రజలకు మరింత సేవ చేయాలనే నా అంతిమ లక్ష్యం కోసమే చేస్తున్నా. నిజాయితీగా సంపాదించి ప్రజల కోసం ఉచిత కిచెన్లు, లైబ్రరీలు, స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయడం తప్పు అయితే ఆ తప్పును నేను చేస్తూనే ఉంటా’ అని గంభీర్ పేర్కొన్నాడు.