ఐసీసీ విమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌: రిచా.. మెరిసినా ఇండియాకు తప్పని ఓటమి

ఐసీసీ విమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌: రిచా.. మెరిసినా ఇండియాకు తప్పని ఓటమి

విశాఖపట్నం: బ్యాటింగ్‌లో రిచా ఘోష్‌ (77 బాల్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94) మెరుపులు మెరిపించినా.. ఐసీసీ విమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌లో ఇండియాకు తొలి ఓటమి తప్పలేదు. ఛేజింగ్‌లో లారా వోల్‌వర్త్‌ (70), నాడిన్‌ డి క్లెర్క్‌ (84 నాటౌట్‌) అద్భుతంగా పోరాడటంతో.. గురువారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచింది.

వర్షం వల్ల ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 49.5 ఓవర్లలో 251 రన్స్‌కు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రతీకా రావల్‌ (37), స్మృతి మంధాన (23) ఫర్వాలేదనిపించినా.. హర్లీన్‌ డియోల్‌ (13), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (9), జెమీమా (0), దీప్తి శర్మ (4), అమన్‌జ్యోత్‌ కౌర్‌ (13) ఫెయిలయ్యారు.

ఈ దశలో రిచా, స్నేహ్‌ రాణా (33) ఎనిమిదో వికెట్‌కు 153 రన్స్‌ జోడించి ఆదుకున్నారు. మారిజానె కాప్‌, డి క్లెర్క్‌, మలాబా తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత సౌతాఫ్రికా 48.5 ఓవర్లలో 252/7 స్కోరు చేసి గెలిచింది. తజ్మిన్‌ బ్రిట్స్‌ (0), సునె లుస్‌ (5), కాప్‌ (20), అనెకా బోష్‌ (1), సినాలో జాఫ్తా (14) నిరాశపర్చారు. 

81 రన్స్‌కే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ ఇన్నింగ్స్‌ను డి క్లెర్క్‌ నిలబెట్టింది. లారాతో ఆరో వికెట్‌కు 61, చోలే ట్రయాన్‌ (49)తో ఏడో వికెట్‌కు 69 రన్స్‌ జోడించి విజయాన్ని అందించింది. క్రాంతి గౌడ్‌, స్నేహ్‌ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. డి క్లెర్క్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.