హైదరాబాద్, వెలుగు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్సీ) దేశంలోనే మొట్టమొదటి ఆల్టర్నేటివ్ డిస్పూట్ రిజల్యూషన్ సెంటర్ (ఏడీఆర్)ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. రాబోయే మూడు నెలల్లో ఇది ప్రారంభమవుతుందని ఐసీఎస్సీ నేషనల్ ప్రెసిడెంట్ మనీశ్ గుప్తా అన్నారు. ఏడీఆర్పై హైదరాబాద్లో శనివారం జరిగిన సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సెంటర్కు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ నాలెడ్జ్ పార్టనర్గా పనిచేస్తుందని వెల్లడించారు.
కంపెనీల వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమని అన్నారు. ఏడీఆర్ సెంటర్ల వల్ల సభ్యులకు, పార్టీలకు మేలు జరుగుతుందని అన్నారు. ‘‘కోల్కతా, మనేసర్లోనూ ఏడీఆర్లను ఏర్పాటు చేస్తాం. వీటి తర్వాత ముంబైలోనూ ఒకదానిని ప్రారంభిస్తాం. మౌలిక సదుపాయాలు ఇది వరకే అందుబాటులో ఉండటం వల్లే హైదరాబాద్లో మొదటి ఏడీఆర్ను ఏర్పాటు చేస్తున్నాం”అని గుప్తా వివరించారు. ఇలాంటి కేంద్రాలు దేశంలోని ఐఎస్సీఐ 72 చాప్టర్లలో అందుబాటులోకి వస్తాయి.
సంస్థకు మనదేశంలో రెండు పరిశోధన విభాగాలు కూడా ఉన్నాయి. దీనికి ఇండియాలో 71 వేల మంది సభ్యులు, 2.5 లక్షల మంది రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రపంచంలోని 1,05,000 మంది కంపెనీ సెక్రటరీలలో 71 వేల మంది ఇండియాలోనే ఉన్నారు. తెలంగాణలో 5500 మంది స్టూడెంట్లు, హైదరాబాద్లో 5000 మంది స్టూడెంట్లు, 2600 మంది సభ్యులు ఉన్నారు.
