
- ఎల్ఆర్ఎస్సే తప్పంటే.. లేటు దరఖాస్తులు ఆమోదించాలా?
- సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఇండ్ల స్థలాల అక్రమ లే అవుట్లు రెగ్యులరైజ్ చేయ డమే చట్ట వ్యతిరేకమని, ఇందుకు ప్రభుత్వం రెగ్యులరైజ్కు ఇచ్చిన గడువు తీరిన తర్వాత చేసుకున్న అప్లికేషన్లను అనుమతించాలని కోరడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విధంగా ఎక్క డైనా చేస్తే చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. అలాంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వ లాయర్ తమకు చెప్పాలని ఆదేశించింది. గడువు దాటిన తర్వాత దరఖాస్తు చేసుకున్నామని, ప్రభుత్వం తమ ఇంటి నిర్మాణానికి అప్లికేషన్లను అనుమతించడం లేదంటూ ఉమ్మడి కరీంనగర్తో పాటు నిర్మల్కు చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ దరఖాస్తులను పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
దీనిపై తొలుత సింగిల్ జడ్జి విచారణ జరిపారు. పిటిషనర్ల తర ఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లందరూ తమ ప్లాట్లకు యజమానులని, విక్రయానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వారి వద్ద ఉన్నాయన్నారు. టీఎస్ బీపాస్ ద్వారా ఇంటి నిర్మాణ అనుమతి కోసం సంబంధింత అధికారులకు దరఖాస్తును సమర్పించడానికి యత్నించారని వెల్లడించారు. ఎల్ఆర్ఎస్జీవో ప్రకారం 2022, ఆగస్టు 26లోపు దరఖాస్తు చేయలేదని తిరస్కరించడం సరికాదన్నారు. వాదనలు విన్న జడ్జి.. పిటిషనర్లు తమ పిటిషన్లో ప్రభుత్వ జీవోను ప్రశ్నించలేదన్నారు. జీవోలో ఎలాంటి తప్పిదం కనిపించడం లేదని, ఈ క్రమంలో ప్రతివాదులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఆదేశాలు ఇచ్చారు.
రిట్ పిటిషన్లను కొట్టివేశారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ, పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. వీటిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎల్ఆర్ఎస్ పేరిట చేసే క్రమబద్ధీకరణే సరికాదని, సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థించి వాదనలను ముగించింది.