
చికుబుకు చికుబుకు రైలే.. అదిరెను దీని టేస్టే
‘అటెన్షన్ ప్లీజ్. ఆర్డర్ చేసిన ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఏడో నంబరు టేబుల్ మీదికి వస్తున్నది. రాంగనే తీసుకోండి. అటెమ్మటి ఎనిమిదో నంబరు టేబుల్ మీదికి వస్తది. వేడి వేడి ఇడ్లీలు అందుకోనీకి రెడీగా ఉండండి’ అంటూ చెఫ్ కేక వేసిండు. ఈ వంటమనిషి ఎన్నడో రైల్వే జాబ్ చేసి మానేసినట్టున్నడు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వేడివేడి రుచుల గురించి ఆయన అనౌన్స్మెంట్స్ అన్నీ రైల్వే స్టేషన్లో విన్న మాటల్లెక్కనే ఉంటయ్! ఎందుకంటే ఆ హోటలే ఓ రైల్వే స్టేషన్. ప్రతి టేబుల్ ఒక ప్లాట్ఫామ్. అన్ని ప్లాట్ఫామ్స్ తిరుగుతూ ఆర్డర్ చేసిన వాటిని బోగీల్లో మోసుకుపోతది సప్లయర్ ట్రైన్. ఇందూరు విందులో రైల్ రెస్టారెంట్ వడ్డిస్తున్న రుచులారగించి ‘చికుబుకు చికుబుకు రైలే..అదిరెను దీని టేస్టే’ అని జనం మస్త్గ పాడుకుంటున్నరు!
నిజామాబాద్ సిటీ వినాయక నగర్లో నెల కిందనే ఒక రెస్టారెంట్ స్టార్ట్ అయింది. ‘జంక్షన్–– 65’.ఈ రెస్టారెంట్లో ఆర్డర్ చేసిన ఐటమ్స్ని టేబుల్ మీదకు తేవడానికి వెయిటర్స్ ఉండరు. కానీ, అడిగింది అర నిమిషం ఆలస్యం కాకుండా తెచ్చిస్తుంది ఓ బుల్లి రైలు. కిచెన్లో రెడీ అయిన వేడి వేడి ఫుడ్ ఐటమ్స్ని చకచకా టేబుల్స్ పైకి చేరుస్తుంది.
రైలు లెక్కనే ఈ చిన్న రైలు కూడా వస్తుంది. సరే, మరి రైళ్లు అప్పుడప్పుడూ ఆగకుండా పోతయి, కదలకుండా ఉంటయి. ‘ఇది కూడా అట్లనే చేస్తదా’ అని డౌట్రావొచ్చు. కానీ ఇది అట్ల ఆగదు. ఎందుకంటే ఈ రైల్ రెస్టారెంట్స్లో ఉన్న పది టేబుళ్ల మీదకు పోవడానికి ట్రాక్ ఉంది. ఆ ట్రాక్లన్నీ తిరుగుతూ పోదు. ఏ టేబుల్ మీద ఆర్డరిస్తే ఆ టేబుల్ మీదకు పోతుంది. ఇట్లా దానిని మానిటరింగ్ చేయడానికి కంప్యూటర్తో కనెక్ట్ చేస్తారు. కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫుడ్ ఐటమ్స్తోపాటు టేబుల్ నెంబరు కూడా ఎంటర్చేస్తారు. గ్రీన్ సిగ్నల్పడగానే రుచుల రైలు పరుగందుకుంటుంది. ఆవురావురుమంటూ ఎదురుచూసే కస్టమర్స్కి రుచులెన్నో వడ్డిస్తూ మళ్లీ జంక్షన్ (కిచెన్)కి చేరుకుంటుంది. ఆర్డర్స్ లిస్ట్ చెక్ చేసి టేస్టీ ఫుడ్ లోడ్ చేయగానే మేనేజర్ పచ్చజెండా ఊపేస్తాడు. రుచుల రైలు మళ్లీ పరుగుతీస్తుంది. ఇట్ల పొద్దున మొదలైన ప్రయాణం మాపటిదాకా చడీచప్పుడు లేకుండా నడుస్తూనే ఉంటుంది. రెండు వందల రకాల డిష్లను ఈ రైలు వడ్డిస్తుంది. వీటిల్లో బిర్యానీ ఆర్డర్లే ఎక్కువట! కొత్త ఒక వింత కదా! ఆ వింతైన విందును ఆరగించడానికి జనం ఎగబడుతున్నారట! ఈ ఇచ్ఛంత్రం చూస్తేనే కొంతమందికి ఆకలి తీరిపోతుందట! 50 మందికి సరిపోయే సీటింగ్ కెపాసిటీ ఉన్న ‘జంక్షన్ – 65’ రెస్టారెంట్ డిసెంబరు 10 నుంచి నాన్స్టాప్గా నడుస్తూనే ఉంది.
మళ్లీ మళ్లీ విందుకు
హోటల్ మేనేజ్మెంట్లో సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాలి. ఎంతో కాలం కష్టపడితేనే మంచి పేరొస్తుంది. పేరు వచ్చేంత వరకు నష్టాలొచ్చినా భరించాలి. కానీ జంక్షన్ – 65 ఓనర్స్కి ఆ ప్రాబ్లమ్ లేదు. అనుభవం లేకున్నా క్రియేటివిటీ వాళ్లకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 60 లక్షల రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్కి కోట్లు పెట్టినా రాని బ్రాండ్ ఇమేజ్ ఉందిప్పుడు. జెయింట్ వీల్ మీద తిరగాలని పిలగాండ్లు ఆశపడితే జాతరకి తీసుకుపోయినట్లు ఇందూరు జనం రైల్ రెస్టారెంట్ చూపించాలని ఫ్యామిలీ అంతా కలిసిపోతున్నారు. ఆర్డర్ చేసిన ఐటమ్స్ ట్రెయిన్లో టేబుల్ దాకా రావడం చాలా బాగుంది. ఇది చూసి ఎంజాయ్ చేస్తామంటే పిల్లలను ‘జంక్షన్ -– 65’కి తీసుకొచ్చింది పూజ. కస్టమర్స్లో పిల్లలే ఎక్కువ మంది ఉంటున్నారని హోటల్ ఓనర్లలో ఒకరైన కార్తీక్ చెప్తున్నాడు. ఈటింగ్, ఔటింగ్, ఎంటర్టైన్మెంట్లా ఉందని వాళ్లు ముచ్చటపడుతున్నారు. ‘ఐడియా బాగుంది. టేస్ట్ బాగుంది. ఈ హోటల్కి మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది’ అని కస్టమర్ సారిక చెప్పింది.
‘జంక్షన్ – 65’లో రెండు రైళ్లున్నాయి. ఇవి పది ప్లాట్ఫామ్స్ (టేబుళ్ల)పైకి తిరుగుతూ ఫుడ్ని సర్వ్ చేస్తుంటాయి. ఈ రైలు రెండున్నర కేజీల బరువుని మోస్తుంది. ఈ ట్రైన్స్తోపాటు వాటిని ఆపరేట్ చేసే టెక్నాలజీ కోసం మొత్తం 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
కస్టమర్స్ సంతృప్తే మా సక్సెస్
ఇంజినీరింగ్ అయిపోయాక బిజినెస్ మేనేజ్మెంట్ చదివాను. చదువుకునేటప్పుడు విజయవాడలో ఫ్రెండ్స్తో కలిసి ఒక థీమ్ రెస్టారెంట్కి వెళ్లాను. ఆ ఫీలింగ్ మరచిపోలేనిది. చదువు అయిపోయింది. ఉద్యోగం కంటే బిజినెస్ బెస్ట్ అనుకున్నాను. ఇప్పుడు బయట తినే కల్చర్ పెరుగుతోంది. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ బెస్ట్ అనుకున్నాను. యూ ట్యూబ్లో ఈ రైల్ రెస్టారెంట్ని ఓసారి చూశాను. ఇది మన దగ్గర ట్రై చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. నాన్న రఘుతో చెప్పాను. ఆయన ఎంకరేజ్చేశారు. మా అన్న కార్తీక్ బాగా సపోర్ట్ చేసిండు. యూ ట్యూబ్లోనే దీని గురించి స్టడీ చేశాను. కావాల్సిన వాటిని సమకూర్చుకుని రెస్టారెంట్ సెటప్ చేసేసరికి 60 లక్షల రూపాయలు ఖర్చయింది. ఈ బిజినెస్లో సక్సెస్ అవుతానా? లేదా? అనే డౌట్ లేకుండా నిజామాబాద్ జనం నన్ను ఆశీర్వదించారు.-సిద్ధార్థ పెండెం, ‘జంక్షన్ – 65 ’ ఓనర్.
ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి
క్రికెటర్ల జీవితాలతో ఆటలు.. హెచ్ సి ఎ చెత్త పాలనతో ప్లేయర్లకు ఇక్కట్లు
సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు
రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్