
- త్వరలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేస్తాం
హైదరాబాద్, వెలుగు: ఇండియా బిజినెస్ కోసం రాబోయే కొన్నేళ్లలో రూ.10,500 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామని స్వీడిష్ ఫర్నిచర్ కంపెనీ ఐకియా ప్రకటించింది. హైదరాబాద్ స్టోర్ ఏర్పాటు చేసి ఐదేళ్లు అయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ సీఈఓ సూజన్ పుల్వెలర్ మీడియాతో మాట్లాడుతూ గుర్గావ్, నోయిడా వంటి నగరాల్లో స్టోర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది వరకే తమకు ఇండియాలో ఐదు స్టోర్లు ఉన్నాయని తెలిపారు. ‘‘మరో ఒకటిరెండేళ్లలో బ్రేక్ఈవెన్ సాధిస్తాం. హైదరాబాద్ స్టోర్ను ఇప్పటి వరకు 17.5 కోట్ల మంది సందర్శించారు. మేం 9,500 వరకు ప్రొడక్టులను అమ్ముతున్నాం.
మా ఆదాయంలో ఆన్లైన్ నుంచి 17 శాతం వరకు వస్తోంది. మాకు ఇండియాలో 60 సప్లయర్లు ఉన్నారు. ఇక్కడ మేం తయారు చేసిన టెక్స్టైల్, కార్పెట్స్, ప్లాస్టిక్ ప్రొడక్టుల్లో కొన్నింటిని విదేశాలకు పంపిస్తున్నాం. లోకల్ సోర్సింగ్ను 50 శాతానికి పెంచుతాం. ఇండియాలో మాకు మూడు వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 620 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు. స్టోర్లలో 70 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చాం. ఉద్యోగుల సంఖ్యను పది వేలకు పెంచాలని నిర్ణయించాం” అని ఆమె వివరించారు.
ఇంకో స్టోర్ తెరవండి...
ఈ కార్యక్రమానికి చీఫ్గెస్ట్గా వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడుల్లో ఐకియా ఒకటని అన్నారు. హైదరాబాద్ స్టోర్ విజయవంతంగా నడుస్తోంది కాబట్టి నగరంలోనే ఇంకో దానిని ఏర్పాటు చేయాలని సూచించారు. ‘‘లోకల్ సప్లయర్ల నుంచి మీరు కొనుగోళ్లను పెంచాలి. టీ–వర్క్స్తో కలిసి ఐకియా పనిచేస్తే బాగుంటుంది. అక్కడ డిజైనర్లకు సహకారం అందించవచ్చు. రిటైల్ అకాడమీకి కూడా మీ తోడ్పాటు అవసరం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మీరు గతంలో పత్తి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో పత్తి బాగా పండుతోంది. మా రాష్ట్రంలో పత్తి మరింత నాణ్యంగా ఉండాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలో తెలియజేయండి”అని ఆయన కోరారు.