ఇండియాలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి.. ఐకియా సీఈఓ సూజన్​

ఇండియాలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి.. ఐకియా సీఈఓ సూజన్​
  • త్వరలో మరిన్ని  స్టోర్లను ఏర్పాటు చేస్తాం

హైదరాబాద్​, వెలుగు: ఇండియా బిజినెస్​ కోసం రాబోయే కొన్నేళ్లలో రూ.10,500 కోట్ల వరకు ఇన్వెస్ట్​ చేస్తామని  స్వీడిష్​  ఫర్నిచర్​ కంపెనీ ఐకియా ప్రకటించింది. హైదరాబాద్​ స్టోర్​ ఏర్పాటు చేసి ఐదేళ్లు అయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ సీఈఓ సూజన్​ పుల్వెలర్ మీడియాతో మాట్లాడుతూ గుర్గావ్​, నోయిడా వంటి   నగరాల్లో స్టోర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.   ఇది వరకే తమకు ఇండియాలో ఐదు స్టోర్లు ఉన్నాయని తెలిపారు. ‘‘మరో ఒకటిరెండేళ్లలో   బ్రేక్​ఈవెన్​ సాధిస్తాం. హైదరాబాద్​  స్టోర్​ను ఇప్పటి వరకు 17.5 కోట్ల మంది సందర్శించారు. మేం 9,500 వరకు ప్రొడక్టులను అమ్ముతున్నాం. 

మా ఆదాయంలో ఆన్​లైన్​ నుంచి 17 శాతం వరకు వస్తోంది. మాకు ఇండియాలో 60 సప్లయర్లు ఉన్నారు. ఇక్కడ మేం తయారు చేసిన టెక్స్​టైల్​, కార్పెట్స్​, ప్లాస్టిక్​ ప్రొడక్టుల్లో  కొన్నింటిని విదేశాలకు పంపిస్తున్నాం. లోకల్​ సోర్సింగ్​ను 50 శాతానికి పెంచుతాం. ఇండియాలో మాకు మూడు వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 620 మంది హైదరాబాద్​లో పనిచేస్తున్నారు. స్టోర్లలో 70 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చాం. ఉద్యోగుల సంఖ్యను పది వేలకు పెంచాలని నిర్ణయించాం” అని ఆమె వివరించారు. 

ఇంకో స్టోర్ తెరవండి... 

ఈ కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్​ మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడుల్లో ఐకియా ఒకటని అన్నారు. హైదరాబాద్​  స్టోర్​ విజయవంతంగా నడుస్తోంది కాబట్టి నగరంలోనే ఇంకో  దానిని ఏర్పాటు చేయాలని సూచించారు. ‘‘లోకల్​ సప్లయర్ల నుంచి మీరు కొనుగోళ్లను పెంచాలి. టీ–వర్క్స్​తో కలిసి ఐకియా పనిచేస్తే బాగుంటుంది. అక్కడ డిజైనర్లకు సహకారం అందించవచ్చు. రిటైల్​ అకాడమీకి కూడా మీ తోడ్పాటు అవసరం. కార్పొరేట్​ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మీరు గతంలో పత్తి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో పత్తి బాగా పండుతోంది.  మా రాష్ట్రంలో పత్తి మరింత నాణ్యంగా ఉండాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలో తెలియజేయండి”అని ఆయన కోరారు.