ముంబై: ఐపీఎల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ 19వ సీజన్లో కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈనెల 28న మొదలయ్యే మెగా లీగ్ ఆరంభానికి ముందు ముంబైలో బుధవారం జరిగిన కెప్టెన్స్ మీట్లో ఐపీఎల్ ప్లేయింగ్ కండిషన్స్, రూల్స్పై పది ఫ్రాంచైజీల కెప్టెన్లు బీసీసీఐ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ హెడ్ జవగళ్ శ్రీనాథ్, అంపైర్ నితిన్ మీనన్తో చర్చించారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై చాలా మంది కెప్టెన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
దీనివల్ల బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతుల్యత దెబ్బతింటుందని అభిప్రాయపడినప్పటికీ కమర్షియల్, వినోద కోణంలో 2027 సీజన్ ముగిసే వరకు ఈ రూల్ను సమీక్షించే అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు. లీగ్లో ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ 10వ ఓవర్ తర్వాత బాల్ను మార్చే నిబంధన ఉంది. మంచు ప్రభావం నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్లోనూ దీనిని అనుమతించాలని ఓ కెప్టెన్ కోరగా అధికారులు అందుకు అంగీకరించలేదు.
మంచు ప్రభావం రెండో ఇన్నింగ్స్లోనే ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్లో ప్రస్తుత నిబంధనలే సరిపోతాయని స్పష్టం చేశారు. మరోవైపు పిచ్లను కాపాడే ఉద్దేశంతో మ్యాచ్ జరిగే రోజు గ్రౌండ్లో అధికారిక ప్రాక్టీస్ సెషన్లను నిషేధించారు. అలాగే, ప్రాక్టీస్ కోసం ఒక జట్టుకు కేటాయించిన వికెట్ను మరో టీమ్ వాడకూడదని,
నిర్ణీత టైమ్లోపే ఓ టీమ్ ప్రాక్టీస్ పూర్తి చేసుకుంటే, మిగిలిన సమయాన్ని ప్రత్యర్థి జట్టు వాడుకోవడానికి అనుమతి లేదని చెప్పారు.
ఇక, స్లో ఓవర్ రేట్ విషయంలో కెప్టెన్లదే బాధ్యతని, వారిపైనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ మీట్లో ట్రోఫీతో ఫొటోషూట్లో పాల్గొన్న పది జట్ల కెప్టెన్లు సరదాగా గడిపారు. సన్ రైజర్స్ రెగ్యులర్ లీడర్ కమిన్స్ ప్లేస్లో స్టాండిన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ రావడంతో పది జట్లకూ ఇండియన్సే కెప్టెన్లుగా వ్యవహరించినట్టయింది.
