- జాతి ప్రయోజనాల కోసం రోడ్డెక్కండి
- దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయండి.. పాకిస్తానీలకు ఇమ్రాన్ పిలుపు
- ఇయ్యాల్నే పాక్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్
ఇస్లామాబాద్: ప్రధాని కుర్చీలోంచి తనను దింపేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని, కొన్ని విదేశాలకూ ఇందులో భాగం ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్శనివారం ఆరోపించారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా, జాతి ప్రయోజనాలు కాపాడుకోవడానికి పాకిస్తానీలంతా రోడ్డెక్కి ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ‘మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చేయండి’ అంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రజలను కోరారు. శనివారం ఓ టీవీ చానెల్తో ఇమ్రాన్ మాట్లాడారు. ‘నాపై కుట్రలు పన్నుతున్న వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా.. ఎలా ఎదుర్కుంటానో రేపు(ఆదివారం) మీరే చూస్తారు. నా దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటా. ఇలాంటి కుట్ర వేరే ఏ దేశంలోనైనా జరిగితే అక్కడి ప్రజలంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తారు’ అని పేర్కొన్నారు.
తీర్మానంపై గెలిస్తే ముందస్తుకు..
ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తాను గెలిస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్తానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. ఫిరాయింపుదారులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపలేమన్నారు. ‘ఎస్టాబ్లిష్మెంట్’ తనకు 3ఆప్షన్లు ఇచ్చిందని, అందులో ఒకటి రాజీనామా చేయడం, రెండు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం, మూడు ముందస్తు ఎన్నికలకు పోవడం అని పేర్కొన్నారు. అయితే.. ‘ఎస్టాబ్లిష్మెంట్’ అంటే ఏమిటో ఇమ్రాన్ఖాన్ చెప్పకపోయినప్పటికీ.. అది పాక్లోని పవర్ఫుల్ మిలిటరీ గురించేనని స్పష్టమవుతున్నది. అవిశ్వాసంలో ప్రతిపక్షాలు ఓడిపోయి తాము గెలిస్తే ముందస్తు ఎన్నికలకు మార్గం మరింత ఈజీ అవుతుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. ప్రతిపక్షాలైన పాకిస్తాన్ ముస్లిం లీగ్నవాజ్ (పీఎంఎల్ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) దేశాన్ని అవమానిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ఓటింగ్పై ఉత్కంఠ
ఇమ్రాన్ ఖాన్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్ జరుగనుంది. ఈ ఓటింగ్పై పాక్ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇమ్రాన్ఖాన్ విజయం సాధించాలంటే నేషనల్ అసెంబ్లీలో 172 సభ్యుల మద్దతు కావాలి. అయితే.. తమకు 175 మంది సభ్యుల మద్దతుందని, ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.