
మెచ్యూర్ కానున్న 2 కంపెనీల బాండ్లు
న్యూఢిల్లీ: భారీగా అప్పులున్నాయని విమర్శలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్కు కొత్త చిక్కొచ్చి పడింది. వచ్చే ఏడాది సుమారు రూ.16 వేల కోట్ల (2 బిలియన్ డాలర్ల) బకాయిలను తీర్చాల్సి ఉంది. జులై, 2015 – 2022, డిసెంబర్ మధ్య అదానీ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల (రూ.82 వేల కోట్ల) ను ఫారిన్ కరెన్సీ బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా సేకరించింది. ఇందులో 1.15 బిలియన్ డాలర్ల (రూ.9,430 కోట్ల) విలువైన బాండ్లు 2020, 2022 లో మెచ్యూర్ అయ్యాయి. ఈ ఏడాది ఏ బాండ్లు కూడా మెచ్యూర్ అవ్వడం లేదని, కానీ, వచ్చే ఏడాది 2 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లు మెచ్యూర్ అవుతాయని ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రెజెంటేషన్లో అదానీ గ్రూప్ పేర్కొంది. ఇందులో అదానీ పోర్ట్స్ ఇష్యూ చేసిన 650 మిలియన్ డాలర్లు బాండ్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ ఇష్యూ చేసిన 750 మిలియన్ డాలర్లు, 500 మిలియన్ డాలర్ల బాండ్లు మెచ్యూర్ కానున్నాయి. ఫండ్స్ కోసం సింగపూర్, హాంకాంగ్లలో అదానీ గ్రూప్ కిందటి నెల రోడ్ షోలు నిర్వహించింది.
కంపెనీ ఫైనాన్షియల్స్ కంట్రోల్లో ఉన్నాయని గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్ ఇన్వెస్టర్లకు చెబుతున్నారు. ఈ నెల 7 నుంచి 15 మధ్య ఇలాంటి రోడ్ షోలనే దుబాయ్, లండన్, యూఎస్లలో అదానీ గ్రూప్ చేపడుతోంది. కార్యకలాపాల నుంచి వచ్చిన క్యాష్ను అప్పులు తీర్చడానికి వాడతామని కంపెనీ మేనేజ్మెంట్ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చింది. అదానీ గ్రూప్ మొత్తం అప్పులు 2019 నాటికి రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ నెంబర్ ప్రస్తుతం రూ.2.21 లక్షల కోట్లకు పెరిగింది. కంపెనీ దగ్గరున్న క్యాష్ రిజర్వ్లను తీసేయగా నికర అప్పులు రూ.1.89 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2025 లో ఎటువంటి ఫారిన్ కరెన్సీ బాండ్లు మెచ్యూర్ అవ్వడం లేదు. కానీ, 2026 లో ఒక బిలియన్ డాలర్ల విలువైన బాండ్లు మెచ్యూర్ అవుతాయి.