కల్యాణ వైభోగం.. భక్తులతో కిక్కిరిసి భద్రాద్రి

కల్యాణ వైభోగం.. భక్తులతో కిక్కిరిసి భద్రాద్రి

భద్రాద్రిలో సీతారాముల కల్యాణం వైభవంగా ప్రారంభం అయింది. స్వామి వారి కల్యాణానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కల్యాణానికి వచ్చే భక్తులతో భద్రాద్రి కిక్కిరిసి పోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. వేలాదిమంది కూర్చిని వీక్షించేలా చలువ పందిర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఎండ తీవ్రతను తట్టుకునేలా ఫ్రీగా మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపినీ చేస్తున్నారు అధికారులు. ఈ సారి సువర్ణ ద్వాదశ రథం పై రాములవారి ఊరేగింపు జరుగనుంది. వాహనాల మరమ్మత్తు తర్వాత తిరిగి ఈ తంతును పున: ప్రారంభించనున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవం చూసి తరించడానికి చిన్న జీయర్ స్వామి, బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తరలివచ్చారు. భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది వచ్చారు.

ఇవాళ (మార్చి 30) ఉదయం 9.30 గంటలకు కల్యాణ మూర్తులను వేద మంత్రోచ్చారణల నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ఉదయం 10.30 నుంచి కల్యాణ తంతు ప్రారంభం అయింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుమూహుర్తాన కల్యాణ మహోత్సవం జరుగుతుంది.