2022–23 లో రూ. కోటి కంటే ఎక్కువ సంపాదనపై ట్యాక్స్ కట్టిన వారి సంఖ్య 1,69,890
గత మూడేళ్లలోనే కొత్తగా 57,951 మంది కొత్త కోటీశ్వరులు
రూ.50 లక్షలు - కోటి బ్రాకెట్లో 44 శాతం గ్రోత్
బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా వంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత కూడా దేశ ఎకానమీ స్ట్రాంగ్గా నిలబడింది. దేశంలో రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారు గత మూడేళ్లలో భారీగా పెరిగారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం, 2022–23 లో రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నవారి సంఖ్య 1,69,890 కి పెరిగింది. కరోనా ముందు అంటే 2019–20 లో ఈ నెంబర్ 1,11,939 గా రికార్డయ్యింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లోనే 57,951 మంది కొత్తగా కోటీశ్వరుల జాబితాల్లో చేరారు. మరోవైపు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు గల సంపాదనపై ట్యాక్స్ కడుతున్నవారి సంఖ్య 2022–23 లో 3,32,065 కి పెరిగింది.
2019–20 లో ఈ నెంబర్ 2,30,163 గా రికార్డయ్యింది. ఇది 44 శాతం గ్రోత్కు సమానం. కేవలం 2020–21 లో మాత్రమే రూ.కోటి పైన సంపాదనపై ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి నెంబర్ తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వీరి సంఖ్య 81,653 కి పడిపోయింది. కరోనా లాక్డౌనే ఇందుకు కారణం. దేశంలో కోటీశ్వరులు పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ బూమ్, స్టార్టప్ సెక్టార్ పుంజుకోవడం, ఎక్కువ శాలరీస్ ఇచ్చే జాబ్స్ పెరగడం వంటివి కోటీశ్వరులు పెరగడానికి కారణమని వివరించారు. మూన్లైటింగ్ కూడా సాయపడిందని చెప్పారు. మూన్లైటింగ్ అంటే ఒకేసారి రెండు జాబ్లు చేయడం. మరోవైపు ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇండివిడ్యువల్స్ ఆదాయాన్ని, ట్యాక్స్ వివరాలను సేకరించడంలో మెరుగుపడిందని
వివరించారు. రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయంపై ట్యాక్స్ కట్టిన వారి నెంబర్ 2016–17 లో 68,263 గా ఉంది.
కరోనా టైమ్లో కంపెనీలకు లాభాలు
కరోనా టైమ్లో చాలా కంపెనీ లాభపడ్డాయని, ఈ కంపెనీల సీఈఓలు, సీనియర్ మేనేజ్మెంట్ ఎక్కువగా ప్రయోజనం పొందిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) మాజీ చైర్మన్ ఆర్ ప్రసాద్ పేర్కొన్నారు. మిడిల్ మేనేజ్మెంట్, కింద ఉన్న ఉద్యోగులు కేవలం సాధారణ ఇంక్రిమెంట్లు మాత్రమే పొందారని చెప్పారు. కోటీశ్వరులలో ఎంత మంది జీతాలపై ఆధారపడుతున్నరనే డేటాను ట్యాక్స్ డిపార్ట్మెంట్ బయటపెట్టలేదు. కానీ, వీరి సంఖ్య కరోర్పతి ట్యాక్స్పేయర్లలో సుమారు సగం ఉంటుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. రూ. కోటికి పైగా ఆదాయం గల ట్యాక్స్పేయర్ల సంఖ్య పెరుగుతోందని, ఇది ఎకానమీ గ్రోత్ను , ట్యాక్స్ సిస్టమ్ మెరుగ్గా పనిచేయడాన్ని తెలుపుతోందని గ్రాంట్ థోర్నటన్ పార్టనర్ భరత్ అన్నారు.
సంక్షోభం ఉన్నప్పటికీ ఐటీ, ఐటీఈఎస్, కన్సల్టెన్సీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లు బాగా లాభపడ్డాయి. ఇప్పుడు ఫండింగ్ సమస్యలు ఎదుర్కుంటున్న స్టార్టప్ సెక్టార్ కూడా కరోనా టైమ్లో బాగా పనిచేసింది. ఈ సెక్టార్లు ఎక్కువ శాలరీ ఇచ్చే జాబ్స్ను ఆఫర్ చేయడంతో పాటు, ఈసాప్స్తో టాలెంట్ను ఆకర్షించాయి’ అని వివరించారు. ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈసాప్స్) కింద కంపెనీ షేర్లను తమ ఉద్యోగులకు మేనేజ్మెంట్ ఇస్తుంది. స్టాక్ మార్కెట్ భారీగా పెరగడంతో కూడా కోటీశ్వరులు పెరిగారని ఈవై ఇండియా ట్యాక్స్ పార్టనర్ సుధీర్ కపాడియా అన్నారు. ‘కరోనా టైమ్లో స్టాక్ మార్కెట్లు భారీగా పెరగడంతో షార్ట్టెర్మ్ కోసం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా ఇన్వెస్టర్లు లాభపడ్డారు’ అని పేర్కొన్నారు.
కోటీశ్వరులు పెరగడంలో స్టార్టప్లు, యూనికార్న్ల పాత్ర కూడా ఎక్కువగా ఉందని చెప్పారు. కాగా, బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 2020 మార్చిలో 26 వేల దిగువకు పడిపోగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి 59 వేల లెవెల్ను టచ్ చేసింది. గత మూడేళ్లలోనే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చింది. రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నవారి డేటాను సేకరించడంలో, వీరిపైన ట్యాక్స్ వేయడంలో ట్యాక్స్ డిపార్ట్మెంట్ మంచి పనితీరు కనబరిచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్), ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) ను వివిధ పేమెంట్ సిస్టమ్స్కు విస్తరించడంతో ట్యాక్స్ కలెక్షన్ భారీగా పెరిగిందని ఈవై ఇండియా ట్యాక్స్ పార్టనర్ సుధీర్ కపాడియా వివరించారు.
ట్యాక్స్ కట్టే కంపెనీలు పెరుగుతున్నాయి..
రూ. కోటి కంటే ఎక్కువ సంపాదనపై ట్యాక్స్ కట్టిన వారి మొత్తం సంఖ్య 2022–23 లో 2,69,184 గా నమోదయ్యింది. ఇందులో 66,397 కంపెనీలు, 25,262 సంస్థలు, 3,059 ట్రస్ట్లు కలిసి ఉన్నాయి. అంతేకాకుండా ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్లు, లోకల్ అధికారులు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కూడా కలిసి ఉన్నాయి. 2019–2020 లో 53,679 కంపెనీలు రూ. కోటి కంటే ఎక్కువ సంపాదనపై ట్యాక్స్ కట్టాయి. అంటే ఈ ట్యాక్స్ బ్రాకెట్లో కంపెనీల సంఖ్య గత మూడేళ్లలో 21 శాతం పెరిగింది. అదే ఇండివిడ్యువల్స్ సంఖ్య 51 శాతం పెరిగింది. 2022–23 లో 66 వేల కంపెనీలు రూ. కోటీ కంటే ఎక్కువ సంపాదనపై ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినా కేవలం లిస్టెడ్ కంపెనీలు మాత్రమే తమ సీనియర్ మేనేజ్మెంట్కు ఇస్తున్న శాలరీస్ వివరాలను పబ్లిక్లో ఉంచాయి. ఇందులో 754 కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చిన రెమ్యూనిరేషన్ వివరాలనూ బయటపెట్టాయి. ఈ కంపెనీల్లోని 1,161 మంది ఉద్యోగులు రూ. కోటి కంటే ఎక్కువ శాలరీ ప్యాకేజిని అందుకుంటున్నారు.